బీజేపీకి బిగ్ షాక్ : సాగు చట్టాల వ్యతిరేక తీర్మానానికి సొంత ఎమ్మెల్యే మద్దతు...
కేరళలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే,కేంద్ర మాజీ మంత్రి రాజగోపాల్ ఆ పార్టీకి ఊహించని షాకిచ్చారు. పినరయి విజయన్ నేత్రుత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన తీర్మానానికి ఆయన మద్దతు తెలిపారు. నిజానికి సాగు చట్టాలపై చర్చ సమయంలో వాటిని సమర్థించిన రాజగోపాల్... ఆ తర్వాత ఓటింగ్కి మాత్రం దూరంగా ఉన్నారు. తద్వారా తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రాజగోపాల్ వ్యవహారం బీజేపీని తీవ్రంగా ఇరుకున పెట్టినట్లయింది. పైగా తాను ప్రజాస్వామిక స్పూర్తిని ప్రదర్శించానని... అందుకే తీర్మానం ఏకగ్రీవ ఆమోదం పొందేందుకు సహకరించానని రాజగోపాల్ పేర్కొనడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
మొదట సమర్థించి...
సాగు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా రాజగోపాల్ ఆ చట్టాలను బలంగా సమర్థించారు. 'ఈ చట్టాలు రైతులకు చాలా మేలు చేస్తాయి... వారికి రక్షణ కల్పిస్తాయి. దళారులు,కమిషన్ ఏజెంట్లను దూరం పెట్టేందుకు దోహదం చేస్తాయి. దేశంలో రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తాయి. రైతుల ప్రయోజనాలను వ్యతిరేకించేవారే ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. గతంలో కాంగ్రెస్,సీపీఐ(ఎం) కూడా ఈ చట్టాలు చేయాలనుకున్నాయి.' అని రాజగోపాల్ పేర్కొన్నారు.
ఓటింగ్కి దూరంగా..
తమ పార్టీ వైఖరికి అనుకూలంగా ఇంత స్పష్టంగా సాగు చట్టాలను సమర్థించిన రాజగోపాల్... తీర్మానంపై ఓటింగ్ విషయంలో మాత్రం తన వ్యక్తిగత అభీష్టం మేరకే నడుచుకున్నారు. ఓటింగ్కి దూరంగా ఉండి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు సహకరించారు. రాజగోపాల్ ఇలా డబుల్ స్టాండ్ తీసుకోవడంపై మీడియా ప్రశ్నించగా ఆయన తనదైన శైలిలో స్పందించారు. 'నేనీ తీర్మానాన్ని వ్యతిరేకించకపోవడానికి కారణం... ఈ విషయంలో ప్రజలకు భిన్నాభిప్రాయాలు తెలియాల్సిన అవసరం లేదు. సాధారణ ఏకాభిప్రాయంతోనే ముందుకు వెళ్లాలనుకున్నాను. అందుకే తీర్మానానికి మద్దతునిచ్చాను. నా ఉద్దేశంలో ఇది ప్రజాస్వామిక స్పూర్తి..' అని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు.
వ్యక్తిగత స్టాండ్ అని...
ఇది తన వ్యక్తిగత స్టాండ్ అని దీనికి పార్టీతో సంబంధం లేదని రాజగోపాల్ పేర్కొనడం గమనార్హం. పైగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మొండిగా వ్యవహరించడం సరికాదని... రాజీ పడటం కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనని అభిప్రాయపడ్డారు. తీర్మానం ఏకగీవ్రంగా ఆమోదం పొందడానికి ముందు అందులోని అంశాల పట్ల అభ్యంతరాలను ప్రజల ముందు పెట్టానని పేర్కొన్నారు. మొత్తంగా తీర్మాన సారాంశంతో మాత్రం తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
మద్దతునిచ్చిన యూడీఎఫ్...
కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం గురువారం(డిసెంబర్ 31) అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కాంగ్రెస్ నేత్రుత్వంలోని యూడీఎఫ్ కూడా మద్దతు పలికింది. కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని ఈ తీర్మానం ద్వారా డిమాండ్ చేశారు. గత నెల రోజులకు పైగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దఫాలుగా కేంద్రం రైతులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మళ్లీ జనవరి 4న కేంద్రం మరోసారి రైతులతో చర్చలు జరపబోతుంది. త్వరలో జరగబోయే చర్చల్లోనైనా ఈ ప్రతిష్ఠంభనకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదోనన్న చర్చ జరుగుతోంది.