కనికరించని పోలీసులు..? ఎర్రటి ఎండలో తండ్రిని భుజాలపై మోసుకెళ్లిన కొడుకు..
లాక్ డౌన్ వేళ ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ఓ పేద మహిళ పోలీసులకు కూల్ డ్రింక్స్ ఆఫర్ చేసి వారి పట్ల గౌరవాన్ని చాటుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో చూశాం. కానీ మరోవైపు కొంతమంది పోలీసులు తమ దుందుడుకు వైఖరితో విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా కేరళలో జరిగిన ఓ ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మానవ హక్కుల కమిషన్ కూడా విచారణకు ఆదేశించడం గమనార్హం.
Recommended Video
అసలేం జరిగింది...
కేరళలోని కొల్లాం జిల్లా కులతుపుజాకు చెందిన ఓ వృద్దుడు(65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పునలూరు తాలుకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జి చేశారు. దీంతో తండ్రిని ఇంటికి తీసుకొచ్చేందుకు అతని కమారుడు రోయ్మన్.. తన తల్లితో కలిసి సొంత ఆటోలో ఆసుపత్రికి వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో ఓచోట పోలీసులు ఆటోను అడ్డుకున్నారు. సరైన డాక్యుమెంట్స్ లేని కారణంగా ఆటోను కదలనిచ్చేది లేదని చెప్పారు.
భుజాలపై మోసుకుంటూ..
రోయ్మన్ తన తండ్రి ట్రీట్మెంట్కు సంబంధించిన ఆసుపత్రి డాక్యుమెంట్స్ చూపించినా పోలీసులు వినిపించుకోలేదు. తన తండ్రి నడవలేని స్థితిలో ఉన్నాడని చెప్పినా పోలీసులు వినిపించుకోకపోవడంతో రోయ్మన్ తల్లడిల్లిపోయాడు. చేసేదేమీ లేక.. ఆటోను పక్కనే పార్క్ చేసి.. ఎర్రటి ఎండలో తండ్రిని తన భుజాలపై మోసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అప్పటికే ఆటోలో సగానికి పైగా దూరం చేరుకోగా.. మరో 1 కి.మీ వెళ్తే ఇల్లు వస్తుందనగా పోలీసులు ఆపేశారు. దీంతో కి.మీ దూరం వరకు తన తండ్రిని భుజాల పైనే మోస్తూ రోయ్మన్ ఇల్లు చేరుకున్నాడు.
మానవ హక్కుల కమిషన్ విచారణ..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ పక్కన రోయ్మన్ తండ్రిని భుజాలపై మోస్తూ వెళ్లగా.. మరో పక్క అతని తల్లి రెండు బ్యాగులను మోసుకుంటూ అతని వెనకాలే నడిచింది. ఎండ పూట రోయ్మన్ తండ్రి శరీరంపై షర్ట్ కూడా లేకపోవడం గమనార్హం. మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనను సుమోటో కేసుగా తీసుకుని విచారణకు ఆదేశించింది. జిల్లా ఎస్పీ నుంచి రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆసుపత్రి డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత కూడా పోలీసులు తమను ఆటోలో వెళ్లేందుకు అనుమతించలేదని రోయ్మన్ తెలిపారు. అయితే పోలీసుల వాదన మరోలా ఉంది. తాము ఆటోను ఆపిన సమయంలో అందులో అసలు పేషెంటే లేరని చెబుతున్నారు. మెడికల్ డాక్యుమెంట్స్ ఏవీ తమకు చూపించలేదని.. లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలోనే వారిని అనుమతించలేదని చెబుతున్నారు.
#WATCH Kerala: A person carried his 65-year-old ailing father in Punalur & walked close to one-kilometre after the autorickshaw he brought to take his father back from the hospital was allegedly stopped by Police, due to #CoronavirusLockdown guidelines. (15.4) pic.twitter.com/I03claE1XO
— ANI (@ANI) April 16, 2020