ఓవర్ యాక్షన్!.. పొట్టనబెట్టుకున్నారా?, అమ్మాయి భుజంపై చేయి వేసినందుకే!
విచారణ పేరుతో ఆ యువకుడిని, అతని గర్ల్ ఫ్రెండ్ ను పిలిపించి పోలీసులు వేధించారు.
తిరువనంతపురం: పోలీసుల ఓవర్ యాక్షన్ ఓ యువకుడిని బలితీసుకుంది. వేధించిన వారిపై ఫిర్యాదు చేస్తే.. రివర్స్ లో ఫిర్యాదుదారుల పైనే పోలీసులు తమ పైత్యాన్ని ప్రదర్శించారు. లేనిపోని ప్రశ్నలతో వేధించి ఆఖరికి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకొచ్చారు.
కేరళలోని పలక్కాడ్ లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. పలక్కాడ్ కు చెందిన ఓ 20ఏళ్ల యువకుడు ప్రేమికుల దినోత్సవం రోజున తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి కొల్లాం బీచ్ కు వెళ్లాడు. ఆ ప్రదేశంలో టాయిలెట్స్ సౌకర్యమేది లేకపోవడంతో పక్కనే ఉన్న పొదల్లోకి అతని గర్ల్ ఫ్రెండ్ వెళ్లింది.
ఇది గమనించిన ఓ స్వచ్చంద సంస్థ ప్రేమికుల దినోత్సవానికి తాము వ్యతిరేకమంటూ సదరు యువతిని వేధించారు. వ్యక్తిగత కారణాలతో పొదల్లోకి వెళ్లిన ప్రియురాలిని వేధించడం తట్టుకోలేక ఆ యువకుడు తిరగబడ్డాడు. దీంతో అతనిపై దాడికి పాల్పడి నోటికి వచ్చినట్లు తిట్టారు. అంతేకాదు, ఇద్దరిని కలిపి ఫోటోలు తీసి, వారేదో తప్పు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
మొత్తం వ్యవహారంపై తీవ్రంగా కలత చెందిన యువకుడు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేసినా.. ఫిర్యాదుదారులపై కూడా తమ ప్రతాపం చూపించారు. విచారణ పేరుతో ఆ యువకుడిని, అతని గర్ల్ ఫ్రెండ్ ను పిలిపించి పోలీసులు వేధించారు.
బీచ్ లో చనువుగా ప్రవర్తించారంటూ ఫైన్ వేశారు. ఈలోగా విషయం కాస్త ఆ నోటా.. ఈ నోటా రాష్ట్రమంతటా వ్యాపించింది. గట్టి చర్యలు తీసుకోవాలంటూ పినరయి విజయన్ ఆదేశించడం.. ఆలోపే యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.
దీనిపై స్పందించిన ఆ యువకుడి గర్ల్ ఫ్రెండ్ వేరొకరి చేయి నా భుజంపై ఉన్నంత మాత్రాన దాన్ని తప్పుగా పరిగణిస్తే ఎలా అని ప్రశ్నించింది. చిన్న చిన్నవాటికే పోలీసులు ఇలా బెదిరించడం మానుకోవాలని సూచించింది.
కాగా,ఇటీవలే ఓ పార్క్ లో ప్రేమికులను పోలీసులు వేధించిన ఘటన కేరళవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. పోలీసుల బెదిరింపు ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటంతో కేరళ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.