మిస్ట్కాల్ పరిచయం.. పెళ్లి చేసుకోమంటోందని ప్రియురాలిని ఇంటికి తీసుకెళ్లి...
తిరువనంతపురం : మిస్ట్ కాల్ పరిచయం ఆ యువతి పాలిట శాపంగా మారింది. సెల్ ఫోన్ పరిచయం కాస్తా ఆమె ప్రాణాలు తీసింది. పెళ్లి చేసుకొమ్మన్న పాపానికి ఓ దుర్మార్గుడు సదరు యువతిని దారుణంగా చంపేశాడు. విషయం బయటకు రాకుండా ఉప్పపాతరేశాడు. చివరకు పాపం పండింది. నెల రోజుల తర్వాత గుట్టు బయటపడింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.
నెల క్రితం మిస్సింగ్
కొచ్చికి చెందిన రాఖీ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది. జూన్ 21న ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కూతురు ఎంతకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు తెలిసిన వారందరిని అడిగారు. అయినా జాడ తెలియక పోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. రాఖీ కాల్ హిస్టరీని చెక్ చేయగా.. ఆమె ఒక వ్యక్తితో తరుచూ మాట్లాడుతుండేదని తెలిసింది. తీగలాగడంతో డొంక కదిలింది. అతన్ని నమ్మి మోసపోయిన రాఖీ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మిస్ట్ కాల్ పరిచయం
కాల్ సెంటర్లో పనిచేసే రాఖీకి ఓ రోజు ఆమె ఫోన్కు మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరో తెలుసుకునేందుకు తిరిగి కాల్ చేయగా అఖిల్ అనే యువకుడు పొరపాటున కాల్ వచ్చిందని చెప్పాడు. తాను ఆర్మీలో పనిచేస్తున్నాని తన వివరాలు చెప్పి పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అది నిజమని భ్రమించిన రాఖీ అతనిని నమ్మి ప్రేమకు ఓకే చెప్పింది. కొన్నాళ్ల పాటు వీరి ప్రేమ బంధం సజావుగానే సాగింది. ఇంతలో అఖిల్కు మరో యువతి పరిచయం కావడంతో పరిస్థితి మారిపోయింది. అఖిల్ రాఖీని దూరం పెట్టడం మొదలుపెట్టాడు.
హత్య చేసి పూడ్చిపెట్టిన ప్రియుడు
అఖిల్ ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన రాకీ ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అతడు వేరే యువతితో సన్నిహితంగా ఉండటమే కాకుండా ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిసి షాక్ తింది. ఈ విషయం గురించి అఖిల్ను నిలదీసింది. తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆ దుర్మార్గుడు రాఖీని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్లో భాగంగా సమస్య పరిష్కరించుకుందామని ఆమెను నమ్మించి నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే కాపుగాసిన అతని ఇద్దరు స్నేహితుల సాయంతో రాఖీని హత్య చేశాడు. అనంతరం గొయ్యి తవ్వి ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. డెడ్ బాడీ కుళ్లిపోయిన తర్వాత వాసన రాకుండా ఉండేందుకుక శవాన్ని ఉప్పుతో కప్పేశాడు.
నిందితుడి కోసం పోలీసుల వేట
హత్య అనంతరం అఖిల్ పత్తా లేకుండా పోయాడు. దీంతో పోలీసులు అతని కోసం వేట మొదలుపెట్టారు. రాఖీ శవాన్ని వెలికి తీసిన పోలీసులు కుటుంబసభ్యులకు అప్పజెప్పారు. అఖిల్కు హత్యలో సహకరించిన ఇద్దరు స్నేహితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిల్ పనిచేసే ఆర్మీ బెటాలియన్కు హత్యకు సంబంధించిన సమాచారం అందజేశారు.