ఆ మంత్రిపై కేసు కొనసాగిల్సిందే: స్పెషల్ కోర్టు
తిరువనంతపురం: కేరళలో అధికారంలో ఉన్న యూడీఎఫ్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కే.ఎం మణి మీద నమోదైన కేసు దర్యాప్తు చెయ్యాలని, కేసు విచారణ కొనసాగుతుందని ప్రత్యేక కోర్టు తేల్చి చెప్పింది.
కేరళలో బార్ల లైసెన్సులను పునరుద్ధరించేందుకు ఆ రాష్ట్ర ఆర్థి శాఖ మంత్రి మణి రూ. ఐదు కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. 470 బార్ల తెరిపించేందుకు 2014లో రూ. ఒక కోటి లంచం తీసుకున్నారని ఆరోపణలు రావడంతో కేసు నమోదు అయ్యింది.
అయితే మంత్రి మణి మీద వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆదారాలు లేవని విజిలెన్స్ అండ్ కరప్షన్ బ్యూరో కోర్టుకు నివేదిక ఇచ్చింది. ఆయన మీద ఉన్న కేసును మూసివేస్తున్నామని కోర్టులో చెప్పింది. అయితే ఆ నివేదికను ప్రత్యేక కోర్టు జడ్జ్ జాన్. కే. ఇల్లెకదన్ తోసిపుచ్చారు.
మంత్రి మీద చార్జ్ షీటు వెయ్యడానికి తగిన సాక్ష్యాలు లేవని విజిలెన్స్ బ్యూరో తన నివేదికలో చెప్పింది. అయితే ఈ నివేదికను సవాలు చేస్తూ సీపీఎం సీనియర్ నాయకుడు వీ.ఎస్. అచ్యుతానందన్ తో పాటు మరో 8 మంది కోర్టులో పిటీషన్లు వేశారు.
బార్ల మంజూరు చేసే విషయంలో మణి లంచం డిమాండ్ చేశారని, రూ. కోటి లంచం తీసుకున్నారని తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని వారు కోర్టులో చెప్పారు. కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు మంత్రి మణి మీద ఆరోపణలు రావడంతో అక్కడి ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.