‘నన్నే ఆపుతారా?’: టోల్ కట్టమన్నందుకు బారియర్ విరిచేసి ఎమ్మెల్యే వీరంగం!(వీడియో)
Recommended Video
తిరువనంతపురం: టోల్ ఫీజు కట్టమంటే చాలు కొందరు ఎమ్మెల్యేలకు ఎక్కడలేని కోపం వచ్చేస్తోంది. తామేదో ఆ రాజ్యానికి రాజు అయినట్లు.. మేమెందుకు టోల్ కడతామంటూ రెచ్చిపోయి టోల్ సిబ్బందితో ఘర్షణకు దిగుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలో చాలానే చూశాం. తాజాగా, కేరళలో ఓ ఎమ్మెల్యే ఏకంగా టోల్ స్టాప్ బారియర్ను విరగ్గొట్టి వీరంగం సృష్టించాడు.
టోల్ బారియర్ను విరిచేసి
కేరళలోని పూంజార్ ఎమ్మెల్యే పీసీ జార్జ్.. మంగళవారం అర్ధరాత్రి కొచ్చి నుంచి త్రిశూర్కు ఓ ఖరీదైన కారులో వెళుతున్నారు. ఆయన వాహనం పాలియెక్కర టోల్ ప్లాజా వద్దకు రాగానే అక్కడి సిబ్బంది టోల్ ఫీజు కట్టమని ఆ వాహనాన్ని ఆపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వెంటనే తన అనుచరులతో దిగి వచ్చి స్టాప్ బారియర్ను విరగొట్టారు. దీంతో అక్కడి టోల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
సీసీటీవీలో రికార్డ్
కాగా, సీసీటీవీ ఫుటేజీలో నమోదైన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై పుదుక్కడ్ పోలీసులు మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే వాహనాన్ని అనుమతించడానికి కొంత జాప్యం జరిగిందని సిబ్బంది తెలిపారు. ఈలోపు ఆయన వచ్చి స్టాప్ బారియర్ను ధ్వంసం చేసినట్లు సీసీటీవీలో నమోదైంది' అని తెలిపారు.
నన్ను టోల్ ఫీజు కట్టమంటారా?
టోల్ సిబ్బంది ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే జార్జ్ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే బోర్డు ఉన్నప్పటికీ నన్ను టోల్ ఫీజు కట్టాలని అడిగారు. చాలాసేపు ఎదురుచూశాను. అప్పటికే చాలా ఆలస్యమైంది' అని చెప్పారు. కాగా, ఆ తర్వాత టోల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఆ ఎమ్మెల్యేకిదేం కొత్త కాదు..
అయితే, జార్జ్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం తొలిసారేం కాదు. గత సంవత్సరం ఫిబ్రవరిలో.. ఆర్డర్ చేసిన వెంటనే భోజనం తెచ్చివ్వలేదని క్యాంటిన్ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. మరో ఘటనలో భూమి విషయంలో వ్యాపారులతో గొడవకు దిగిన జార్జ్.. అనంతరం తుపాకీ పేలుస్తూ నినాదాలు చేయడంతో సంచలనానికి తెరతీశారు.