కేరళ వరదల్లో ఎంతోమందిని కాపాడిన మత్స్యకారుడు రోడ్డు ప్రమాదంలో మృతి
తిరువనంతపురం: ఇటీవల కేరళలో భారీ వరదలు వచ్చినప్పుడు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఆరెస్సెస్తో పాటు మత్స్యకారులు ఎనలేని సేవలు చేశారు. ఈ వరదల సాయంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో జినీష్ (24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తిరువనంతపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అతను ప్రమాదంలో కన్నుమూశారు.
గత వారం అతను తన బైక్ మీదుగా వెళ్తుండగా అది స్కిడ్ అయి కిందపడ్డాడు. అతను లారీ కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వరదల సమయంలో ఇతను ఎంతోమందిని కాపాడారు. వరదల సమయంలో మత్స్యకారుల సేవలకు దేశం యావత్తు వారిని ప్రశంసించింది. అందులో జినీష్ కూడా ఒకరు.
తొలుత ముందుకొచ్చిన యువకుల్లో జినేష్
జినీష్ వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడి బయటకు తీసుకు వచ్చారు. వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొచ్చి తన శాయశక్తులా కృషి చేశారు. వరదలకు తీవ్రంగా ప్రభావితమైన అలపుజాలోని చెన్గన్నూర్లో సహాయం చేసేందుకు తొలుత ముందుకొచ్చిన యువకుల్లో జినేశ్ కూడా ఉన్నాడు.
ప్రత్యేక నేవీ ఫోర్స్గా
మత్స్యకారులు తమ సొంత పడవలతో రంగంలోకి దిగి దాదాపు 65 వేల మందిని కాపాడారు. వీరిని రాష్ట్ర ప్రత్యేక నేవీ ఫోర్స్గా పేర్కొని అభినందించారు. వరదల సమయంలో వారి క్షేమం గురించి పట్టించుకోకుండా, వారి కుటుంబాల గురించి ఆలోచించకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎం కూడా ప్రశంసించారు. వారికి ప్రశంసా పత్రాలు అందించారు.
వేలాదిమందిని కాపాడారు
దాదాపు 200 మంది మత్స్యకారులకు కోస్టల్ వార్డెన్స్గా పోలీసు ఉద్యోగాలు కూడా ఇస్తున్నట్లు కేరళకు చెందిన మంత్రి ప్రకటన చేశారు. వరదల సమయంలో మత్స్యకారులు తమ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చు పెట్టి మరీ వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రజలను కాపాడారు. మత్స్యకారులు దాదాపు 65వేల మందిని రక్షించారు.
ప్రమాదం జరిగిందని తెలియగానే రక్తదానం చేసేందుకు క్యూ
జినీష్ కొల్లంగోడు నుంచి కన్యాకుమారి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతనికి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయని తెలిసి పెద్ద ఎత్తున ప్రజలు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. వంద మందికి పైగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో చాలామంది పాల్గొన్నారు.