కేరళలో మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్..?, ఒకేరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు రావడంతో యోచన..
కేరళలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజు వెయ్యికి పైగా కేసులు రికార్డయ్యాయి. దీంతో పినరయి విజయన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తున్నది. కరోనా వైరస్ నియంత్రణ పూర్తి లాక్ డౌన్తో సాధ్యమవుతోందని విజయన్ భావిస్తున్నారు. మరోసారి పూర్తిగా లాక్ డౌన్ విధించాలనే ఆలోచన ఉంది అని.. కానీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
వెయ్యి కరోనా కేసులు
1038 పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8 వేల 818కి చేరింది. బుధవారం తిరువనంతపురంలో 226 రావడం విశేషం. మిగతా 785 కేసులు సామూహిక వ్యాప్తి వల్ల వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 53 మంది ఐసీయూలో ఉన్నారని.. వారికి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వీరిలో 24 మంది వైద్య సిబ్బంది ఉన్నారని సీఎం విజయన్ తెలిపారు.
వైరస్ వ్యాప్తి ఇలా
785 మందిలో 57 మందికి వైరస్ ఎలా సోకిందనే అంశం తెలియలేదని విజయన్ చెప్పారు. 87 మంది విదేశాల నుంచి, 109 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని తెలిపారు. ఇడుక్కికి చెందిన 75 ఏళ్ల వృద్దుడు చనిపోవడంతో మృతుల సంఖ్య 45కి చేరింది. రాష్ట్రంలో మరో 51 హాట్ స్పాట్లను గుర్తించామని చెప్పారు. వీటితో రాష్ట్రంలో మొత్తం హాట్ స్పాట్ల సంఖ్య 397కి చేరింది.
Recommended Video
కేరళలో కాస్త మెరుగు
దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో కరోనా వైరస్ నివారణ 6.9గా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని/వలస కూలీలను 14 రోజులు విధిగా క్వారంటైన్ చేస్తున్నారు. దీంతో కరోనా కేసులు కాస్త తక్కువగానే ఉన్నాయి. కానీ బుధవారం అత్యధికంగా రావడంతో పూర్తిస్తాయి లాక్ డౌన్ గురించి.. పినరయి విజయన్ ఆలోచిస్తున్నారు. మంత్రివర్గ సహచరులతో మంతనాలు జరిపి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.