జలదిగ్భంధంలో కేరళ....వరదల ధాటికి 67 మంది మృతి
కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వరద విలయతాండవం చేస్తోంది. పటనమ్హిట్ట ప్రాంతం పూర్తిగా వరదనీటితో మునిగిపోయింది. ఇదిలా ఉంటే సహాయకచర్యలకు వర్షం అడ్డంకి సృష్టిస్తున్నప్పటికీ... త్రివిధ దళాలు, ఎన్డీఆనర్ఎఫ్ బృందాలు తమ సహాయకచర్యలను కొనసాగిస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు వరదల కారణంగా కేరళలో 67 మంది మృతి చెందినట్లు సమాచారం.
దక్షిన నావల్ కమాండ్ తన కార్యక్రమాలన్నిటినీ వాయిదా వేసుకుని అక్కడి అధికారులను కేరళ సహాయకచర్యల్లో పాల్గొనాలని ఆదేశించింది. వరదల నుంచి ప్రజలను కాపాడాలని దక్షిణ నావల్ కమాండ్ను ఆ రాష్ట్ర సీఎం పినరాయి విజయన్ కోరారు. వరదలకు బాగా దెబ్బతిన్న ఎర్నాకులం త్రిచూర్ ప్రాంతాల్లో నేవల్ కమాండ్ సహాయక చర్యల్లో పాల్గొంటోంది. రాత్రికి రాత్రే చాలామందిని హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత వందేళ్లలో ఎన్నడూ ఈ స్థాయిలో వరదలు కేరళలో రాలేదు.
కేరళకు కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో చాలా మటుకు రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. కొన్ని మెట్రో పరిసర ప్రాంతాలోకి భారీగా నీరు వచ్చి చేరడంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. బుధవారం కొచ్చి ఎయిర్పోర్టును మూసివేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు... ఆగష్టు 18వరకు ఎయిర్ పోర్టు మూసే ఉంటుందన్నారు. దీంతో కొచ్చికి వచ్చే అంతర్జాతీయ విమానాలను తిరువనంతపురం, ముంబైలకు మళ్లించారు. వరద కారణంగా పలు జాతీయ రహదారులు దెబ్బతినడంతో బస్సులు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
బుధవారం కేరళలో వరద పరిస్థితిని ప్రధాని మోడీకి సీఎం పినరాయి విజయన్ వివరించారు. తిరిగి మళ్లీ గురువారం మోడీతో వరదల విషయమై మరోసారి చర్చించారు పినరాయి విజయన్. వరద పరిస్థితిపై కేరళ సీఎం విజయన్తో తాను మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. కేరళలో సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా రక్షణశాఖను ఆదేశించినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
కేరళలో భారీ వర్షాలకు పంబ నది పొంగి ప్రవహిస్తోంది. దీంతో ప్రముఖ శబరిమలై ఆలయం నీట మునిగినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని డ్యాములు వరదనీటితో నిండుకుండలా మారగా... డ్యామ్ గేట్లను అధికారులు తెరిచి నీటిని వదిలారు. అన్ని డ్యామ్లలో నీరు ప్రమాద స్థాయిని తాకింది.