బస్సులు.. బార్బర్ షాపులు: సడలించిన తొలి 2 గంటలోనే రూల్స్ బ్రేక్: తిక్క కుదర్చిన కేంద్రం
తిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి రెండోదశలో ప్రకటించిన 19 రోజుల లాక్డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చిన తొలి రెండు గంటల్లోనే కేరళలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేశారా? అనే భావన ఏర్పడేలా కనిపించింది అక్కడి వాతావరణం. లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ఎలాంటి వాతావరణం ఉండేదో.. సడలింపు తరువాత అవే పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించింది.
సడలింపు వేళ: కేఫ్లు కిటకిట..షాపుల ముందు రద్దీ: ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు:ఇదీ అక్కడి రిలాక్సేషన్ సీన్
లాక్డౌన్ సడలింపులు ఆరంభమైన వెంటనే జనం రోడ్ల మీదికి వచ్చారు. బస్సు సర్వీసులూ ఆరంభం అయ్యాయి. 30 కిలోమీటర్ల దూరం వరకు రాకపోకలు సాగించేలా ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు తిరుగాడాయి. మాంసం విక్రయల దుకాణలు తెరచుకున్నాయి. బార్బర్ షాపులు జనంతో క్రిక్కిరిసిపోయి ఉండటం కనిపించింది. పాఠశాలలు, విద్యాసంస్థలకు మినహాయింపు ఇవ్వనప్పటికీ దాని అనుబంధంగా కొనసాగే దుకాణాలన్నీ తెరచుకున్నాయి. జిరాక్స్ సెంటర్లు, బుక్ స్టోర్లు యథాప్రకారం ఓపెన్ అయ్యాయి.
కేరళలో నెలకొన్న తాజా పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. కేరళ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీనిపై కేరళ ప్రభుత్వానికి లేఖ రాసింది. పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశించారు. ఈ మేరకు ఆయన కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన తెలిపారు.
Recommended Video
దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తోన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము జారీ చేసిన నిబంధనలను ఉల్లఘించవద్దంటూ అజయ్ భల్లా ఇదివరకే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. నిబంధనలను ఉల్లంఘించిన రాష్ట్రాల్లో సడలింపును ఉపసంహరిస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ కేరళలో అసాధారణ పరిస్థితులు నెలకొనడం పట్ల కేంద్రం అసంతృప్తిని వ్యక్తం చేసింది. తదుపరి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.