ఇంత నీచమా?: పెళ్లిలో దిగిన ఫోటోలను ఏం చేశారో తెలుసా!..
తిరువనంతపురం: ఎక్కడ ఏ కెమెరా తమను వెంటాడుతుందో తెలియని అభద్రతా భావంలో నేడు మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆఖరికి వివాహ వేడుకల్లో దిగిన ఫోటోలు సైతం.. అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేయబడుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
తాజాగా కేరళలో ఓ ఫోటో స్టూడియో ఇలాంటి నీచానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. కొద్ది రోజుల క్రితం ఓ వివాహ వేడుకకు హాజరైన ఒక మహిళ.. ఇటీవల తన మార్ఫింగ్ చిత్రం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడం గుర్తించింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.
సదయమ్ షూట్ అండ్ ఎడిట్ అనే ఫోటో స్టూడియో ఈ నిర్వాకానికి పాల్పడినట్టు గుర్తించారు. కోజికోడ్ జిల్లాలో దీనికి ప్రముఖ ఫోటో స్టూడియోగా పేరు ఉంది. దీంతో చాలామంది.. వివాహ వేడుకల కోసం ఈ స్టూడియోనే సంప్రదిస్తుంటారు.
దీన్ని ఆసరాగా చేసుకుని.. ఆయా వివాహ వేడుకల్లో తీసిన మహిళల ఫోటోలను అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేసి ఆన్ లైన్ సైట్లకు విక్రయిస్తున్నారు. మహిళ ఫిర్యాదుతో ఈ నిజాలన్ని వెలుగుచూశాయి. స్టూడియో యజమానులు సతీశన్, దినేశ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
కేసులో మరో ప్రధాన నిందితుడు బిబేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ సైతం అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేశారు. కాగా, మహిళ ఫిర్యాదుతో స్టూడియోలో తనిఖీలు చేసిన పోలీసులకు ఓ హార్డ్ డిస్క్ లభించింది. అందులో మహిళలకు సంబంధించి దాదాపు 40వేల ఫోటోలు ఉన్నట్టు గుర్తించారు. స్టూడియోను సీజ్ చేసిన అధికారులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.