కేరళ మరో కీలక నిర్ణయం.. కరోనా నియంత్రణ చర్యల్లో దేశానికే ఆదర్శంగా..
కరోనా నియంత్రణ చర్యలకు సంబంధించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ చర్యల కోసం రూ.15వేల కోట్లు ప్రకటిస్తే.. ఆయన కంటే ముందే కేరళలో కరోనా నియంత్రణ కోసం విజయన్ రూ.20వేల కోట్లు ప్రకటించారు. దీన్నిబట్టి కేరళలో ప్రజారోగ్యానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్థమవుతోంది. విజయన్ ప్రకటించిన ప్యాకేజీలో కరోనాను ఎదుర్కొనే అన్ని రంగాలను సమన్వయం చేసిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే 'ప్రజా కిచెన్..'
ప్రజా కిచెన్స్..
21 రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని ముఖ్యమంత్రి విజయన్ భావించారు. ఇందుకోసం స్థానిక సంస్థల నేత్రుత్వంలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతీ గ్రామంలోనూ వీటిని ఏర్పాటు చేస్తారు. తద్వారా ఆ గ్రామంలో ఎవరైనా ఆకలితో ఉన్నవారు.. కమ్యూనిటీ కిచెన్కి ఫోన్ కాల్ చేస్తే చాలు.. ఇంటి వద్దకే ఫుడ్ డెలివరీ చేస్తారు. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు,వలంటీర్లు ఈ సేవలను అందిస్తారు. హోమ్ క్వారెంటైన్లో ఉన్నవారికి కూడా ఇక్కడి నుంచి ఫుడ్ డెలివరీ చేయనున్నారు.
ఫుడ్ డోర్ డెలివరీ..
ఉపాధి నిమిత్తం కేరళకు వచ్చి అక్కడే చిక్కుకుపోయిన కూలీలు,కార్మికులకు కూడా షెల్టర్స్ ఏర్పాటు చేసి ఫుడ్ సప్లై చేయాల్సిందిగా స్థానిక సంస్థలను,రెవెన్యూ డిపార్ట్మెంట్ను ముఖ్యమంత్రి విజయన్ ఆదేశించారు. లాక్ డౌన్ కారణంగా పని కోల్పోయే కూలీలు,కార్మికులు ఆకలితో అలమటించే సమస్య తలెత్తుతుందని.. దాన్ని ముందే గుర్తించి రాష్ట్రంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ బాధ్యతలు అప్పగించామని.. గ్రామాల్లో ఎవరైతే వంట చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారో.. వారికి ఫుడ్ డెలివరీ చేయాలని చెప్పారు.
గ్రామాలు,పట్టణాల్లో..
అందరి సమస్యలను ఒక్క సెంటర్ ఏర్పాటు చేసి తీర్చలేమన్నారు విజయన్. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వికేంద్రీకరణ వ్యవస్థను అమలుచేస్తున్నామని.. వార్డు వలంటీర్ వ్యవస్థతో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు మొదలు మున్సిపల్ శాఖల వరకు ప్రతీ గ్రామం,పట్టణంలో కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసి.. ఆకలితో ఉన్నవారికి ఫుడ్ డెలివరీ చేయాలని చెప్పారు. కమ్యూనిటీ కిచెన్ కోసం వంటవాళ్లను ప్రజాప్రతినిధులే నియమించుకోవాలని చెప్పారు. కొంతమంది మొహమాటంతోనో.. లేక ఎక్కడ పరువు పోతుందన్న తప్పుడు అభిప్రాయంతోనో.. ఫుడ్ కావాలని డైరెక్ట్గా అడగలేరన్నారు. అలాంటివారు కమ్యూనిటీ కిచెన్కు కాల్ చేసి ఫుడ్ తెప్పించుకోవచ్చన్నారు.
కేరళలో కరోనా కేసులు
కరోనా కారణంగా దేశంలో మొదట ఎఫెక్ట్ అయిన రాష్ట్రం కేరళనే. మొదటి పాజిటివ్ కేసు ఇక్కడే నమోదైంది. ఇప్పటివరకు 112 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు కోలుకున్నారు. మరో 8 మందికి నెగటివ్గా తేలింది. దాదాపు 76,542 మంది సర్వైలైన్స్లో ఉంచారు. మరో 532 మందికి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో కొత్తగా 3612 కొత్త అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా కోజికోడ్ జిల్లాలో 351,ఇడుక్కిలో 214,కొట్టాయంలో 208,కసర్గఢ్లో 10 కేసులు నమోదయ్యాయి.
Recommended Video