బాగ్దాదిని గుర్తించిన బ్రీడ్ జాగిలలకు పోలీసు శాఖలో భలే డిమాండ్: ఉగ్రవాదులు, మావోయిస్టుల కదలికపై..!
తిరువనంతపురం: సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ లో భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్ బాగ్దాదిని, ఆయన స్థావరాన్ని కనుగొనడానికి అమెరికా సైనిక బలగాలు వినియోగించిన జాగిలం బ్రీడ్ కు దేశంలో భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆ బ్రీడ్- బెల్జియన్ మాలినోయిస్. పోలీసు శాఖలో బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్ కు చెందిన జాగిలాలను డాగ్ స్క్వాడ్ లోకి అందుబాటులోకి తీసుకుని రావడానికి కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. మావోయిస్టులు, ఉగ్రవాదుల ప్రభావం అధికంగా ఉండే రాష్ట్రాలు ఈ తరహా జాగిలాల సేవలను వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.
ఇప్పటికే కేరళ పోలీసులు బెల్జియన్ మాలినోయిస్ జాగిలాలను అందుబాటులోకి తీసుకొచ్చారు కూడా. కేరళ పోలీసు డాగ్ స్క్వాడ్ లోకి 15 జాగిలాలను తీసుకున్నారు. ఇందులోొ ఎనిమిది పప్పీలు ఉన్నాయి. ఒక్కో పప్పీ ఖరీదు 90 వేల రూపాయలు. ప్రస్తుతం వాటికి శిక్షణ ఇస్తున్నామని కేరళ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ టొమిన్ థచనకెరి తెలిపారు. ఈ జాగిలాలకు పంజాబ్ కెన్నెల ఇన్ స్టిట్యూట్ లేదా త్రిశూర్ పోలీసు అకాడమీలో ఏడాది పాటు శిక్షణ ఇప్పించాల్సి ఉంటుందని, రెండేళ్ల పాటు పనితీరును పరిశీలిస్తామని అన్నారు. మూడో ఏడాది నుంచి డాగ్ స్క్వాడ్ లో వాటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.
బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన కొన్ని జాగిలాలు సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి కేంద్రీయ విచారణ సంస్థల ఆధీనంలో ఉన్నాయని, వాటి సంఖ్య పరిమితమేనని అన్నారు. రాష్ట్ర స్థాయిలో పోలీసు శాఖ సర్వీసుల్లో ఆ జాతికి చెందిన జాగిలాలను వినియోగించుకోవడం ఇదే తొలిసారి అవుతుందని టోమిన్ వెల్లడించారు. ఉగ్రవాదులు, మావోయిస్టుల కదలికలను పసిగట్టటానికి మాత్రమే బెల్జియన్ మాలినోయిస్ జాతి జాగిలాలను వినియోగిస్తామని అన్నారు. వాటిని డాగ్ స్క్వాడ్ లో చేర్చుకోవడానికి కేంద్రం అనుమతిని తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
బాగ్దాదీని మట్టు బెట్టడంలో ఈ జాతి జాగిలం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ జాగిలం ఫొటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ ట్రంప్ స్వయంగా తన అధకారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బాగ్దాది ఆచూకీ కనిపెట్టడంలో అమెరికా సైనిక బలగాలు విఫలమైన దశలో ఆ జాగిలం మాత్రం అతని కదలికలను ఖచ్చితంగా పసిగట్టగలిగింది. ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైన చోట బెల్జియన్ మాలినోయిస్ జాగిలాలను వినియోగిస్తామని, వాటి ద్వారా ఏ మాత్రం పొరపాట్లకు అవకాశమే లేని విధంగా ఉగ్రవాదుల పక్కా సమాచారాన్ని సేకరించడానికి వీలు ఉంటుందని టొమిన్ అభిప్రాయపడ్డారు.