మానవత్వం చూపిన మహిళా కానిస్టేబుల్: కేన్సర్ రోగుల కోసం ఏం దానం చేసిందంటే!
తిరువనంతపురం: కేరళకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ మానవత్వాన్ని ప్రదర్శించారు. కేన్సర్ వ్యాధి గ్రస్తులకు విగ్గులను తయారు చేయడానికి తన శిరోజాలను దానం చేశారు. శిరో ముండనం చేయించుకున్నారు. తన శిరోజాలను ఓ స్వచ్ఛంద సంస్థకు దానం ఇచ్చారు. ఆ మహిళా కానిస్టేబుల్ పేరు అపర్ణా లవకుమార్. కేరళలోని త్రిశూర్ జిల్లా ఇరింజిలకుడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. 46 సంవత్సరాల అపర్ణకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సర్కిల్ ఇన్ స్పెక్టర్ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ మొత్తం మహిళలే పని చేస్తుండటం ఇరింజిలకుడ పోలీస్ స్టేషన్ ప్రత్యేకత.
చంద్రయాన్ 2 మిషన్ వైఫల్యంపై ఇస్రో ఛైర్మన్ సంచలన ప్రకటన: ఆరా తీస్తోన్న కేంద్రం!
కొద్దిరోజుల కిందట తన విధి నిర్వహణలో భాగంగా అపర్ణ స్థానిక పాఠశాలలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఇద్దరు విద్యార్థినులను కలుసుకున్నారు. అయిదో తరగతి చదువుతున్న ఆ ఇద్దరు విద్యార్థినులు కేన్సర్ వ్యాధి గ్రస్తులే. కేన్సర్ ప్రభావంతో వారి శిరోజాలు రోజూ ఊడిపోతున్నాయనే ఆవేదన ఆ ఇద్దరు పిల్లల్లో కనిపించింది. వారి బాధను గమనించిన అపర్ణ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల వద్ద ఆరా తీశారు. కేన్సర్ ప్రభావంతో జుట్టు ఊడిపోవడం సర్వ సాధారణమే అయినప్పటికీ.. ఆ విషయాన్ని తెలుసుకునేంత వయస్సు ఆ విద్యార్థినులకు లేదని వివరించారు.
అలాంటి వారి కోసం తాము విగ్గులను తయారు చేసి, ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. దీనితో- తాను కూడా తన శిరోజాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు అపర్ణా. కేరళ పోలీసు శాఖ రూల్ బుక్ ప్రకారం.. తమ శాఖలో పనిచేసే మహిళ గానీ, పురుషుడు గానీ శిరో ముండనం చేయించుకోకూడదు. దీనితో అపర్ణ జిల్లా రూరల్ పోలీసు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ను కలిశారు. తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆయన అనుమతి ఇవ్వడంతో అపర్ణ శిరోముండనం చేయించుకున్నారు. తన శిరోజాలను ఆ స్వచ్ఛంద సంస్థకు దానం చేశారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.
శిరోముండనం చేయించుకున్న తరువాత ఆమె మళ్లీ ఆ విద్యార్థినులను కలిశారు. అందం అనేది జుట్టులో ఉండదని వారికి అనునయించారు. జుట్టు లేకపోయినా సంతోషంగా జీవించవచ్చని ధైర్యం చెప్పారు. కేన్సర్ నయం కావడానికి తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. కొన్ని నెలలు ఆగితే తన జుట్టు మళ్లీ పెరుగుతుందని, ఆ విద్యార్థినుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు. కాగా- సామాజిక అంశాల పట్ల తక్షణమే స్పందించడం అపర్ణకు కొత్తేమీ కాదని, ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకోవడానికి అవసరమైన డబ్బులను చెల్లించడానికి ఇదివరకు ఆమె ఓ పేద కుటుంబానికి తన బంగారు గాజులను ఇచ్చారని నెటిజన్లు చెబుతున్నారు.