టైమ్ వర్సెస్ లైఫ్: 15రోజుల చిన్నారి..మృత్యువుతో పోరాటం..క్షణ క్షణం ఉత్కంఠ
ఓ వైపు 15 రోజుల చిన్నారి జీవన్మరణ సమస్య...మరోవైపు ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాలంటే దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి. ప్రతి నిమిషం ఎంతో విలువైనది. విమానంలో తరలిద్దామా అంటే అందుకు డాక్టర్లు నో చెప్పారు. బిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. మరి ఎలా... బిడ్డ ప్రాణాలు దక్కాలంటే ఆ ఆస్పత్రికే వెళ్లాలి...ఆ చంటిబిడ్డను అక్కడికి తక్కువ సమయంలో ఎలా చేర్చగలిగారు..?
భగవంతుడిపై భారం వేసిన తల్లిదండ్రులు
అది కర్నాటకలోని మంగళూరు. ఓ 15 రోజుల బిడ్డకు గుండె జబ్బు చేసింది. తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రాణాలను ఎలాగైనా రక్షించండి అంటూ వైద్యులను వేడుకున్నారు. ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాలంటే గుండెకు సంబంధించిన కవాటాలను మార్చాల్సిఉంది. కానీ సమయం తక్కువగా ఉంది. ఆ చికిత్స కోసం కేరళకు చిన్నారిని తరలించాలి. పోనీ విమానంలో చిన్నారిని తరలిద్దామన్నా ఇందుకు డాక్టర్లు నో చెప్పారు. విమానంలో పీడనంతో బిడ్డ ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఏంచేయాలి.... 400 కిలోమీటర్లు... ప్రతి క్షణం విలువైనదే. మించి పోతున్న సమయంతో పోటీ పడాల్సి వచ్చింది. ఇక చేసేదేమీ లేక భగవంతుడిపై భారం వేసి అంబులెన్స్లోనే మంగళూరు నుంచి కేరళలోని కొచ్చికి తరలించే ఏర్పాటు చేశారు.
ప్రతీ క్షణం ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం
ఇక అంబులెన్స్ బయలు దేరింది. వేగం పుంజుకుంది. చిన్నారి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలి. అంబులెన్స్ను సాధ్యమైనంత త్వరగా కొచ్చిలోని అమృతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చేర్చాలి. ఇది డ్రైవర్ ముందున్న సవాల్. బిడ్డ అప్పటి వరకు ప్రాణాలతో ఉంచడం వైద్యుల ముందున్న సవాల్. అంబులెన్స్లో ఉన్న బిడ్డ పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంబులైన్ ఫలానా మార్గంలో పయనిస్తుందని అంబులెన్స్కు మార్గం సుగుమం చేయాలని అభ్యర్థించారు. ఇక మంగళవారం ఉదయం 11 గంటలకు అంబులెన్స్ మంగళూరు నుంచి బయలు దేరింది. ప్రతిక్షణం ఫేస్బుక్ లైవ్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంబులెన్స్ ఆయా ప్రాంతాల్లోకి వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు రహదారిని క్లియర్ చేశారు.
సమయంతో పోటీ పడి గెలిచిన అంబులెన్స్ డ్రైవర్
అంబులెన్స్ రయ్యిన దూసుకెళ్లింది. సాయంత్రం 4:30 గంటల సమయానికల్లా కొచ్చిలోని అమృతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చేరుకుంది. 400 కిలోమీటర్లను కేవలం ఐదున్నర గంటల్లో కవర్ చేసింది. వెంటనే చిన్నారిని అడ్మిట్ చేశారు. అంతకంటే ముందు చిన్నారి కుటుంబ సభ్యులు తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి తరలించాలని భావించారు. అయితే అది మంగళూరు నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంబులెన్స్ సాధారణంగా తీసుకునే సమయం 12 గంటలు. అయితే ఈలోపే కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా కల్పించుకుని చిన్నారిని కొచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా కోరారు. సుదీర్ఘ ప్రయాణం వల్ల చిన్నారి పరిస్థితి కాస్త సీరియస్గానే ఉంది. చిన్నారికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం పథకం హృదయం ప్రాజెక్టు కింద ఉచిత చికిత్స చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అంబులెన్స్కు దారి ఇవ్వాలని ప్రజలకు కేరళ సీఎం పినరాయి విజయన్ పిలుపు
మంగళూరు నుంచి అంబులెన్స్ మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో స్టార్ట్ అయినప్పుడు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్... అంబులెన్స్కు మార్గం సుగుమం చేసి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బిడ్డ పరిస్థితి గంట గంటకు విషమిస్తుండటంతో చిన్నారి ప్రాణాల కోసం ప్రతి ఒక్కరూ భగవంతుడికి ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఎంతో కష్టపడ్డ సిబ్బంది, మార్గం సుగుమం చేసిన ప్రజల కష్టం వృథా పోదనే అనుకుందాం. చిన్నారి తిరిగి క్షేమంగా రావాలని ఆశిద్దాం. ఇక అంత తక్కువ సమయంలో అంబులెన్స్ను నడిపిన డ్రైవర్ను అంతా అభినందిస్తున్నారు.