10 శాతం పేదల రిజర్వేషన్ అమలుకు సిద్దమైన కేరళ- బీజేపీ, మిత్రపక్షాలకు చేతగానిది..
దేశవ్యాప్తంగా అగ్రవర్ణ పేదలకు, ఏ రిజర్వేషన్ ఫలాలు అందని వారిని ఆదుకునేందుకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలోని ఎన్డీయే సర్కారు నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించడమే కాకుండా ఈ మేరకు రాజ్యాంగంలోనూ సవరణలు చేసి పార్లమెంటులో ఆమోదించింది. పేరుకు కేంద్రం రిజర్వేషన్ తీసుకొచ్చిందన్న మాటే కానీ దీన్ని అమలు చేసేందుకు ఏ ఒక్క రాష్ట్రం కూడా సిద్ధం కాలేదు.
కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన పది శాతం పేదల రిజర్వేషన్లను తమ ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాల్లోనే బీజేపీ అమలు చేయలేకపోయింది. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా లైట్ తీసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్ధితి. ఇక్కడ బీజేపీ నేతలు ఎంత ఒత్తిడి తెస్తున్న కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేసేందుకు సిద్దం కావడం లేదు. కానీ అందరికీ షాకిస్తూ బీజేపీని నిత్యం వ్యతిరేకించే కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేసేందుకు సిద్ధమైంది.
అక్టోబర్ 23న సమావేశమైన కేరళ కేబినెట్ 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లను ప్రభుత్వ ఉద్యోగాల్లో వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇకపై అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ పది శాతం రిజర్వేషన్లను అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో కేంద్రం తీసుకొచ్చిన పదిశాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్లను అమలు చేసిన తొలి రాష్ట్రంగా పేరు తెచ్చుకోనుంది.
ఈ రిజర్వేషన్ ప్రకారం నాలుగు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు, పంచాయతీల్లో రెండెకరాల్లోపు భూమి లేదా మున్సిపాలిటీల్లో 75 సెంట్ల కంటే తక్కువ భూమి కలిగిన వారు, కార్పోరేషన్లలో 50 సెంట్ల కంటే తక్కువ భూమి కలిగిన వారికి వర్తింపచేస్తారు. అయితే ఈ రిజర్వేషన్ల అమలును కేరళలో ముస్లింలీగ్, వెల్ఫేర్ పార్టీ, సోషల్ డెమోక్రాటిక్ పార్టీ వ్యతిరేకిస్తున్నాయి. త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికల కోసమే విజయన్ సర్కారు వీటిని అమలు చేస్తోందని ఆరోపిస్తున్నాయి.