భారీ వర్షాలు, కేరళలో విలయతాండవం: 26 ఏళ్ల తర్వాత ఈ గేట్లు ఎత్తారు
Recommended Video
తిరుననంతపురం: కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లాయి. పలు ఆనకట్టల్లో నీరు ప్రమాదస్థాయికి చేరుకుంది.
కేరళ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా 24 ఆనకట్టల గేట్లను ఒకేరోజు ఎత్తారు. నీటిని కిందకు వదిలారు. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దాదాపు ఆరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇడుక్కి, కోజీకోడ్, వయనాడ్, మలప్పురం, ఎర్నాకులంలలో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. పంట తీవ్రత అంచనాకు కేంద్ర బృందం వచ్చింది.
అసియాలోనే అతిపెద్ద అర్ధచంద్రాకార ఆనకట్ట చెరుతోని. దీని గేట్లు కూడా ఎత్తివేశారు. 26 సంవత్సరాల తర్వాత ఇడుక్కీ డ్యామ్ గేట్లను ఎత్తివేయడం ఇదే తొలిసారి. ఇడుక్కి డ్యామ్ గరిష్ట నీటిమట్టం 2403 కాగా, గురువారం సాయంత్రానికే 2393 అడుగులకు చేరింది. దీంతో శుక్రవారం మరో రెండు గేట్లు ఎత్తారు. ఎత్తైన ప్రాంతాలు, ఆనకట్టల సందర్శనకు వెళ్లవద్దని పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేశారు. పెరియార్ నదిలో నీటిమట్టం పెరగడంతో ముందుజాగ్రత్త చర్యగా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి 3 గంటల మధ్య విమాన రాకపోకాలను నిలిపేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రానికి సహకరించేందుకు సిద్ధమని చెప్పారు. ఆర్మీని రంగంలోకి దింపినందుకు ప్రధానికి థ్యాంక్స్ చెప్పారు. గత యాభై ఏళ్లలోనే అతిపెద్ద వర్షమని మంత్రి కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ అన్నారు. అతను కేరళకు చెందినవారు.