లా విద్యార్థినిపై రేప్, హత్య: పోలీసుల అదుపులో వ్యక్తి
కొచ్చి: కేరళ నిర్భయ కేసులో పోలీసులు ప్రగతి సాధించారు. న్యాయశాస్త్ర విద్యార్థిపై అత్యాచారం జరిపి, ఆమెను హత్య చేసిన కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విపరీత మనస్తత్వం గల ఆ వ్యక్తి తమ అదుపులో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
అతన్ని అరెస్టు చేయడానికి సాంకేతికపరమైన సాక్ష్యాధారాల కోసం పరిశీలిస్తున్నామని చెప్పారు. అతను తమ కస్టడిలో ఉన్నాడని, అతను విపరీతంగా ఫోన్ వాడుతాడని చెప్పారు. అయినప్పటికీ హంతకుడు ఫోన్ వాడకపోవడం వల్ల అరెస్టులో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు.
'కేరళ నిర్భయ': దళిత లా విద్యార్ధినిపై రేప్, అసలేం జరిగింది?
శనివారం ఉదయం రాష్ట్ర పోలీస్ చీఫ్ టిపి సెంకుమార్ బాధితురాలి ఇంటిని సందర్శించారు. దర్యాప్తు కీలకమైన దశలో ఉందని ఆయన మీడియాతో చెప్పారు. దర్యాప్తులో ఏ విధమైన అలసత్వం, లోపం లేదని అన్నారు. హత్య జరిగిన రోజు బాధితురాలి ఇంటికి సమీపంలో ఉన్న కీలకమైన అనుమానితుడిని గుర్తించినట్లు ఆయన చెప్పారు.
రాయమంగళం పంచాయతీ స్థానిక కాలువ సమీపంలో గల బాధితురాలి ఇంటి వద్ద లభించిన చెప్పుల జతపై, ఇతర వస్తులపై శాస్త్రీయమైన పరీక్షలు జరపాలని కోరుతూ కురుప్పంపాడీ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు దాఖలు చేసిన దరఖాస్తును పోలీసులు శుక్రవారం వెనక్కి తీసుకున్నారు.
ముందు వేసుకున్న పథకం ప్రకారమే హత్య జరిగిందని దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ పద్మకుమార్ చెప్పారు. తమకు కీలకమైన ఆధారాలు లభించాయని, కేసును ఛేదిస్తామని ఆయన చెప్పారు. ఫోరెన్సిక్, సైబర్ నిపుణుల సాయం తీసుకుంటేనే కేసును ఛేదించడానికి పది బృందాలను ఏర్పాటు చేశారు.