కరోనా వైరస్ నంబర్ 2: దైవభూమిలో రెండో కేసు, ఐసోలేషన్ వార్డులో చికిత్స, మరో 70 మందికి కూడా..
కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతోంది. చైనాలో 304 మంది చనిపోగా.. 14 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కేరళలో రెండో కరోనా వైరస్ కేసు నమోదైంది. దీంతో రోగిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదివరకు కేరళలో మొదటి కరోనా వైరస్ కేసు నమోదైన సంగతి తెలిసిందే.
రెండో కేసు..
చైనా నుంచి వచ్చిన ఒకరికి వైరస్ సోకగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రోగి పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పడంతో... అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో మరో కరోనా వైరస్ కేసు నమోదైందని చెప్పడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండో రోగి కూడా ఇటీవలే చైనా నుంచి వచ్చారు.
ఐసోలేషన్ వార్డు
వీరితోపాటు 1793 మందిని కూడా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వీరంతా ఇటీవల చైనా నుంచి రావడంతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులో 70 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. మిగతా వారికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు.
24న రాక..
కరోనా వైరస్ సోకిన రెండో రోగికి అలప్పుజ మెడికల్ కాలేజీలో వైద్య చికిత్స అందిస్తున్నామని కేంద్ర వైద్యారోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రోగి జనవరి 24వ తేదీన చైనా నుంచి ఇండియా తిరిగొచ్చారని పేర్కొన్నది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను కేరళ ప్రభుత్వం ఆదివారం ప్రకటించనుంది.
అరెస్ట్..
చైనాలో వుహన్లో కరోనా వైరస్ బయటపడిన సంగతి తెలిసిందే. అక్కడి విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఒకరికి ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. వైరస్ సోకిన విద్యార్థి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని పేర్కొన్నారు. మరోవైపు కరోనా వైరస్పై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న ముగ్గురిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.