బస్సు నడుపుతూనే గుండెనొప్పితో కుప్పకూలిన డ్రైవర్, ప్రయాణీకులను కాపాడాడు
తిరువనంతపురం: కేరళ రోడ్డు ట్రాన్సుపోర్ట్ కార్పోరేషన్ (ఆర్టీసీ) డ్రైవర్ ఒకరికి డ్రైవింగ్ చేస్తుండగా గుండెనొప్పి వచ్చింది. అతను చనిపోయారు. కానీ బస్సులోని ప్రయాణీకులను మాత్రం ఆయన కాపాడారు. తనకు గుండెనొప్పి ప్రారంభం కాగానే ప్రమాదం జరగకుండా బస్సును ఆపేశాడు. ఈ సంఘటన ఆదివారం నాడు జరిగింది. బస్సు ఉదయం కొట్టాయం నుంచి తిరువనంతపురం బయలుదేరింది.
బస్సు డ్రైవర్ వయస్సు 40. అతనిని శాజుగా గుర్తించారు. అతను కొట్టాయం జిల్లాలోని తిదనాడ్కు చెందినవాడు. అతను ఎరట్టుపెట్ట బస్సు డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇతను చెన్నాడ్ - తిరుననంతపురం రోడ్డులో నడిచే బస్సుకు డ్రైవర్. అతనికి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో గుండెనొప్పి వచ్చింది. బస్సు కొట్టాయంలోని కొడిమాతా ప్రాంతంలోని బ్రిడ్జి వద్దకు రాగానే గుండె నొప్పి ప్రారంభమైంది. అతను స్టీరింగ్ పైన పడిపోవడానికి ముందు బస్సును పక్కకు ఆపేశాడు.
ఆ బస్సులో ఓ నర్సు కూడా ప్రయాణించిందని, వెంటనే స్టీరింగ్ పైన పడిన ఉన్న బస్సు డ్రైవర్ను పరీక్షించి, అతనికి గుండె నొప్పి వచ్చినట్లుగా చెప్పిందని, ఆ వెంటనే అతనిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని రోడ్డు ట్రాన్సుపోర్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 26 మంది ప్రయాణీకులు ఉన్నారు. మృతి చెందిన శాజుకు భార్య, కూతురు ఉన్నారు. అతని అంత్యక్రియలు మంగళవారం ఉదయం జరగనున్నాయని తెలుస్తోంది.