క్యాష్ క్రంచ్: ట్రెజరీలపైనా ఎఫెక్ట్.. వేతన జీవుడు బతికేదెలా?
ఖజానాలో నిధుల్లేక కేరళ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకున్నది.
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా ప్రతి నెలా మొదటిరోజునే వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు, రిటైరైన వారు పెన్షన్లు అందుకుంటుంటారు. కానీ కేరళలో పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఖజానాలో నిధుల్లేక కేరళ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకున్నది.
పలువురు రిటైర్డ్ మహిళా ఉద్యోగులు తమ పెన్షన్ కోసం కేరళలోని కోశాధికార కార్యాలయాల వద్ద బారులు తీరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. అత్యధికులు తమ ఖాతాల్లో నగదు విత్ డ్రాయల్స్కు వెళితే నగదు కొరత అని బ్యాంకులు చెప్తున్నాయి. నగదు కోసం ఎటిఎంల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
దేశంలోకెల్లా అతిపెద్ద బ్యాంక్గా పేరొందిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో కూడా నగదు అందుబాటులో లేదు. తమ ఖజానాలో కూడా చిల్లిగవ్వ లేదని కేరళ ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల సిబ్బంది, రిటైరైన ఉద్యోగులకు సకాలంలో వేతనాలు, పెన్షన్లు చెల్లించలేకపోతున్నామని పేర్కొంది.
ఆర్బీఐ స్పందించనందు వల్లే..
ఒకవేళ భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) స్పందించకపోతే సిబ్బంది వేతనాలు, పెన్షన్లు చెల్లించడం కష్ట సాధ్యమని కేరళ ఆర్థికశాఖ మంత్రి టీఎం థామస్ ఇజాక్ హెచ్చరించారు. ఆర్బీఐ సరిపడా నగదు నోట్లు సరఫరా చేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఇజాక్ ఆరోపించారు. ఆర్బీఐని కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయాలకు పావుగా వాడుకుంటున్నదని ఇజాక్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు భారీగా నగదు తరలించి.. దేశమంతా సమస్యలు తెచ్చి పెడుతున్నదని ధ్వజమెత్తారు. కొట్టాయంలోనూ ప్రభుత్వ సిబ్బందికి, రిటైర్డ్ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు నిలిచిపోయాయి.
గత ఏడాది నవంబర్ 8 నుంచి
గత నవంబర్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.1000, రూ.500 నోట్లు రద్దుచేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి కేరళ నగదు కొరత సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నది. కేరళతోపాటు దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు నగదు కోసం గంటల కొద్దీ బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతున్నారు. నగదు విత్ డ్రాయల్స్ కోసం ఆపసోపాలు పడుతున్నారు. సొసైటీలో చలామణిలో ఉన్న 85 శాతం నగదు రద్దు చేయడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
పూర్తిస్థాయిలో నగదు చలామణికి కొన్ని నెలలు
పూర్తిస్థాయిలో కొత్త నోట్లు చలామణి చేయడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని గత నెలలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వైరల్ ఆచార్య తెలిపారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం మార్చి నెలాఖరు నాటికి రూ. 16.63 లక్షల కోట్లకు బదులు 13.12 లక్షల కోట్ల నగదు చలామణిలోకి వచ్చిందని సమాచారం. ‘మేం ఉదయం నుంచి కొన్ని గంటలుగా క్యూ లైన్లో వేచి చూస్తున్నాం. కానీ ట్రెజరీ అధికారులు మాత్రం పెన్షన్ పంపిణీ చేయడానికి తమవద్ద సరిపడా నగదు లేదని చెప్తున్నారు' అని కోచిలోని ఒక ట్రెజరీ కార్యాలయం వద్ద క్యూ లైన్ లో నిలుచున్న మహిళ తెలిపారు.
పెన్షన్ల పంపిణీకి అడ్డంకిగా నగదు కొరత
రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మొదలు రాష్ట్రంలోని కోశాధికార కార్యాలయాల్లో సరిపడా నగదు లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఇజాక్ తెలిపారు. విష్ణు, ఈస్టర్ పండుగల నేపథ్యంలో ప్రజలకు మూడు నెలల కోసారి సరఫరా చేసే సంక్షేమ పెన్షన్లు సరఫరా చేసేందుకు సిద్ధమవుతుండగా నగదు కొరత సమస్య బయట పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పెన్షన్ల పంపిణీకి నిధులను సహకార బ్యాంకులకు బదిలీ చేస్తుంది. అక్కడ కూడా నిధులు లేవని తేలిపోవడంతో సమస్యలు పెరిగాయి.
కొనసాగుతున్న క్యాష్ క్రంచ్
ఎస్బీఐ పరిధిలోని వివిధ బ్యాంకులు, ఏటీఎంల్లో నగదు కొరత తీవ్రంగా వేధిస్తున్నదని ఓ వార్తా సంస్థ వార్తాకథనం ప్రచురించింది. నగదు నోట్ల కోసం ప్రజలు ఏటీఎంలు, బ్యాంకు శాఖల చుట్టూ తిరుగుతున్నారని ఆ కథనం సారాంశం. ‘నగదు పంపిణీ కోసం పరిమితులు విధించడమే సమస్యకు మూలం' అని ఒక శ్రామిక మహిళ తెలిపారు. గత రెండు రోజులుగా వేతనం విత్ డ్రా చేసుకోవడం కష్ట సాధ్యంగా పరిణమించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను పలు ఎస్బీఐ ఏటీఎంలను సందర్శించాను. ఒక్కదాంట్లోనూ నగదు లేదు. నగదు లేనప్పుడు వాటి ముందు నగదు లేదని ఎందుకు బోర్డు పెట్టరు' అని ఆమె విసుక్కున్నారు.