కేరళ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ సంచలనం ..అమ్మాయిలు ముసుగు ధరించటం నిషేధం
కేరళలోని ఎంఈఎస్ ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కోజికోడ్ కేంద్రంగా నడుస్తూ, ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎంఈఎస్ తమ అధ్వర్యంలో నిర్వహించబడుతున్న 150 విద్యాసంస్థల్లో విద్యార్థులు ముసుగు ధరించరాదని ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దాదాపు లక్ష మంది విద్యార్థులు ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ విద్యా సంస్థల్లో చదువుతున్నారు.
బురఖా బ్యాన్పై శివసేన యూటర్న్..
ముసుగులు ధరించటానికి వీలులేదని సర్క్యులర్స్ జారీ చేసిన ఎంఈఎస్
తమ పాఠశాలలు, కళాశాలలకు వచ్చే అమ్మాయిలు ముసుగులు ధరించటానికి , ముఖం కప్పుకోటానికి వీలు లేదని ఓ సర్క్యులర్ జారీ చేసింది. గతంలో కేవలం కొద్ది మంది మాత్రమే ముఖం కప్పుకునేవారని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ అదే విధంగా వస్తున్నారని, ఇది సరికాదని చెబుతూ, అమ్మాయిలు ఎవరూ ముఖం కప్పుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. ఎంఈఎస్ ఆదేశాలపై సంప్రదాయ ముస్లిం కుటుంబాలు మండిపడుతున్నాయి.
ముసుగు ధరించరాదన్న నిర్ణయంపై వెల్లువెత్తుతున్న నిరసనలు
తామిచ్చిన ఆదేశాలపై విమర్శలు చెలరేగుతూ ఉండటంతో ఎంఈఎస్ ఇనిస్టిట్యూషన్స్ అధ్యక్షుడు పీకే ఫజల్ గఫూర్ స్పందించారు. తామేమీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకోలేదని, 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి క్లాస్ లకు వచ్చే అమ్మాయిలు ముఖాన్ని కప్పుకోరాదన్న నిర్ణయాన్ని, డ్రస్ కోడ్ ను పక్కాగా అమలు చేస్తామని అన్నారు. అయితే ఈ నిర్ణయం వివాదాస్పద నిర్ణయం అని ఎంఈఎస్ తాజా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పలు కాలేజీల వద్ద విద్యార్థి సంఘాలు నిరసనలకు దిగుతున్నాయి.
కేరళ సంప్రదాయంలో ముసుగు లేదు .. ఎంఈఎస్ డ్రెస్ కోడ్ పాటించాల్సిందే ..ఫజల్ గఫూర్
అయితే హైకోర్టు ఆదేశాల మేరకు కళాశాలల్లో డ్రస్ కోడ్ పై కాలేజ్ మేనేజ్ మెంట్ దే తుది నిర్ణయమని ఈ సందర్భంగా ఎంఈఎస్ ఇనిస్టిట్యూషన్స్ అధ్యక్షుడు పీకే ఫజల్ గఫూర్ వ్యాఖ్యానించారు. కేరళ సంప్రదాయంలో ముఖాన్ని కప్పుకోవడమన్నది ఎన్నడూ లేదని, ముఖం కప్పుకుని వస్తుండటంతో ఎవరినీ గుర్తు పట్టలేని పరిస్థితి నెలకొందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. మతపరమైన కారణాలను సాకుగా చెబుతూ ప్రతి ఒక్కరు ముసుగు వేసుకుని తమకి తామే డ్రస్ కోడ్ ను నిర్ణయించడానికి తాము వ్యతిరేకమని అన్నారు.ఎంఈఎస్ ఇనిస్టిట్యూషన్స్ డ్రెస్ కోడ్ విషయంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు.