ఆరుగురిని వేసేసి.. మరో ఇద్దరు చిన్నారులపై.. కేరళ లేడి సీరియల్ కిల్లర్ నిర్వాకం
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేరళలోని కోజికోడ్ సామూహిక హత్యోదంతంలో ఓ షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తన భర్త, కుమార్తె సహా ఆరుమందిని ఒకేసారి మట్టుబెట్టిన ప్రధాన నిందితురాలు జాలీ థామస్ ను విచారించగా పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యే సంఘటనలు బహిర్గతమైంది. ఆరుమంది కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకున్న జాలీ షాజు.. మరో ఇద్దరు చిన్నారులను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని నిందితురాలే స్వయంగా వెల్లడించినట్లు కోజికోడ్ రూరల్ ఎస్పీ సిమోన్ వెల్లడించారు.
రాహుల్గాంధీ జిందాబాద్, కోజికోడ్ రోడ్ షోలో చిన్నారి హంగామా.. ముద్దుపెట్టిన రాహుల్
2002 నుంచి వరుస హత్యలు..
కోజికోడ్ జిల్లా పొన్నమట్టంలో నివసించే జాలీ థామస్ 14 ఏళ్ల కిందట తన అత్త అణ్నమ్మ థామస్ ను హత్య చేసింది. భోజనంలో కొద్ది కొద్దిగా విషాన్ని కలుపుతూ ఆమెను హత్య చేసింది. ఆ ఘటన చోటు చేసుకున్న నాలుగేళ్ల తరువాత అణ్నమ్మ థామస్ భర్త టామ్ థామస్ గుండెనొప్పితో బాధపడుతూ చనిపోయారు. అప్పట్లో దీన్ని సహజ మరణంగా భావించారు కుటుంబ సభ్యులు. 2011లో తన భర్త రాయ్ థామస్ ను హత్య చేసింది జాలీ. రాయ్ థామస్ పై విష ప్రయోగం చోటు చేసుకున్నట్లు పోస్ట్ మార్టమ్ నివేదికలో స్పష్టమైంది. 2014లో అణ్నమ్మ థామస్ సోదరుడు మాథ్యూ సైతం అదే తరహాలో మరణించారు. దీని వెనుక జాలీ హస్తం ఉన్నట్లు ఎవరికీ అనుమానం రాలేదు.
రెండో భర్త కుటుంబాన్ని వదల్లేదు..
కొన్నేళ్ల తరువాత జాలీ.. షాజు అనే యువకుడిని రెండో వివాహం చేసుకున్నారు. తన పేరును జాలీ షాజుగా మార్చుకున్నారు. ఈ కుటుంబంలో కూడా ఆమె అదే తరహాలో హత్యలకు తెర తీశారు. షాజు కుటుంబానికి చెందిన దగ్గరి బంధువు సిలి, ఆమె కుమార్తె రెండేళ్ల అల్ఫాన్సాపై విష ప్రయోగం చేశారు. వారిద్దరూ రాయ్ థామస్ తరహాలోనే మరణించారు. అప్పుడే తొలిసారిగా జాలీపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అదే సమయంలో రాయ్ థామస్ కు చెందిన ఆస్తిని తన పేరు మీద బదలాయించుకోవడానికి ఆమె ప్రయత్నించడం వల్ల ఆ అనుమానాలకు బలం చేకూరింది. రాయ్ థామస్ సోదరుడు జాలీపై ఫిర్యాదు చేయడంతో ఈ హత్యల పరంపరం వెలుగులోకి వచ్చింది.
చిన్నారులపై విష ప్రయోగం..
ఈ హత్యలకు మూల కారకురాలు జాలీయేనని తేలింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టడానికి కేరళ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కోజికోడ్ రూరల్ ఎస్పీ సిమోన్ ను దీని బాధ్యతలను అప్పగించింది. మరిన్ని హత్యలకు జాలీ కుట్ర పన్నినట్లు సిట్ విచారణ సందర్భంగా తేలింది. రెండో భర్త షాజుకు దగ్గరి బంధువుల కుటుంబంలో ఇద్దరు చిన్నారులపై విష ప్రయోగం చేసినట్లు జాలీ పోలీసుల విచారణంలో వెల్లడించింది. దీనితో షాక్ గురైన పోలీసులు ఆ ఇద్దరు చిన్నారులకు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వారికి నిర్వహించిన పరీక్షల్లో వారి రక్తంలో సైనెడ్ ఆనవాళ్లు లభించాయని సిమోన్ వెల్లడించారు. ప్రస్తుతం జాలీ తమ కస్టడీలో ఉందని పేర్కొన్నారు. కస్టడీ ముగిసిన తరువాత న్యాయస్థానంలో ప్రవేశపెడతామని చెప్పారు.
సీపీఎం నేత సస్పెండ్..
ఈ కేసును తీవ్రాతి తీవ్రంగా పరిగణించాలంటూ టామ్ థామస్, షాజీ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జాలీకి మరణ శిక్ష విధించాలని పట్టుబడుతున్నారు. కాగా- ఈ కేసులో జాలీకి సీపీఎం స్థానిక నాయకుడొకరు మద్దతుగా నిలిచారు. ఈ హత్యలన్నింటికీ జాలీనే కారణమనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఉన్న తీవ్రతను దృష్టి పెట్టుకున్న సీపీఎం.. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించింది. కేసును పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారనే కారణంతో.. ఆ నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.