ప్రేమించి, పెళ్లి: భార్యను ఐఎస్కు సెక్స్ బానిసగా అమ్మే యత్నం, అరెస్ట్
తిరువనంతపురం: ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత.. ఆమెను ఉగ్రవాద సంస్థ ఐసిస్కు అమ్మేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడు రియాజ్ మొహమ్మద్ ది కేరళలోని కొచ్చి. అతని భార్య గుజరాత్లోని జామ్ నగర్కు చెందిన యువతి. కాగా, తన తండ్రి ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత ఆమె కుటుంబం అంతా కేరళకు మకాం మార్చింది.
ఒకే కాలేజీలో చదువుకుంటున్న తరుణంలో 2014లో బాధితురాలితో రియాజ్కు పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించి, నమ్మించాడు. ఆ తర్వాత వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న వీడియోలను చూపి, భయపెట్టి ఇస్లాం మతంలోకి మారాలని, తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. ఈ నేపథ్యంలో, వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు.
కాగా, మొహమ్మద్ రియాజ్ తల్లిదండ్రులు సౌదీఅరేబియాలోని జెడ్డాలో ఉంటారు. పెళ్లి అయిన తర్వాత తన భార్యను తీసుకుని జెడ్డా వెళ్లాడు రియాజ్. అనంతరం సిరియాలో ఆమెను ఐసిస్కు సెక్స్ బానిసగా అమ్మేందుకు యత్నించాడు. అయితే, సరైన సమయంలో విషయాన్ని పసిగట్టిన బాధితురాలు.. జరుగుతున్న విషయం గురించి తన తల్లిదండ్రులకు తెలియజేసింది.
ఈ ఘటనకు సంబంధించి కొచ్చిలోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు, ఎన్ఐఏ ఈ ఘటనపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో, ఆదివారం చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన రియాజ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి సెల్ఫోన్, పెన్ డ్రైవర్ను స్వాధీనం చేసుకున్నారు.