కేంద్ర మంత్రికి సినిమా, బంద్ దెబ్బకు ఐపీఎస్ పై వేటు: మాకు తెలీదు, బీజేపీ, పంపాకు కారులో!
తిరువనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, నియమాలు పాటించిన పోలీసు అధికారిపై కేంద్రం కన్నెర్ర చేసింది. ఫలితంగా కేంద్రం పెద్దల మీద ఎదురుతిగిన పోలీసు అధికారి మీద బదిలి వేటు పడింది. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ను అడ్డుకున్న కేరళ సిన్సియర్ పోలీసు కమీషనర్ మీద బదిలి వేటు వేస్తూ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. అయితే దీనికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
అయ్యప్ప దర్శనం
కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఇరుముడి కట్టుకుని అయ్యప్పస్వామి దర్శనం కోసం అనుచరులతో ఇటీవల కేరళలోని నిళక్కల్ వెళ్లారు. ఆ సందర్బంలో మంత్రి వాహనాలను అడ్డుకున్న ఐపీఎస్ అధికారి యతీష్ చంద్ర మీరు పంపా వరకు ఆర్ టీసీ బస్సులో వెళ్లాలని మనవి చేశారు. పంపాలో పార్కింగ్ సమస్య కారణంగా ఎలాంటి ప్రైవేటు వాహనాలు అనుమంతించలేదని, మీరు సహకరించాలని ఐపీఎస్ అధికారి యతీష్ చంద్ర కేంద్ర మంత్రికి చెప్పారు.
మంత్రి కారుకు ఓకే
పంపా వరకు ప్రైవేటు వాహనంలో వెళ్లడానికి మంత్రి పొన్ రాధాకృష్ణన్ కు మాత్రం అనుమతి ఇచ్చారు. ఆయన అనుచరులు మాత్రం ఆర్ టీసీ బస్సులో పంపా వరకు వెళ్లాలని ఐపీఎస్ అధికారి యతీష్ చంద్ర చెప్పారు. ఆ సందర్బంలో కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కు, ఐపీఎస్ అధికారి యతీష్ చంద్రల మధ్య వాగ్వివాదం జరిగింది. మంత్రులు అయినా, సామాన్యులు అయినా నియమాలు పాటించాలని ఐపీఎస్ అధికారి యతీష్ చంద్ర శాంతియుతంగానే సమాధానం ఇచ్చారు.
కన్యాకుమారి బంద్
గురువారం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో బంద్ నిర్వహించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పట్ల కేరళ పోలీసు అధికారులు అనుచితంగా ప్రవర్తించారని తమిళనాడు బీజేపీ నాయకులు ఆరోపించారు. కేరళ వచ్చిన కేంద్ర మంత్రికి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ బీజేపీ నాయకులు కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఐపీఎస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దెబ్బకు దెబ్బ
కన్యాకుమారి బంద్ సందర్బంగా కేరళ ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్సుల మీద రాళ్ల దాడి జరిగింది. కేరళ బస్సుల మీద రాళ్ల దాడి జరగడం, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో తమిళనాడు- కేరళ అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేశారు. కన్యాకుమారిలో తమిళనాడు ఆర్ టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కేరళ ఆర్ టీసీ బస్సులు పాక్షింగా దెబ్బ తిన్నాయి. అంతే ఐపీఎస్ అధికారిని బదిలి చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బీజేపీ ఒత్తిడి ?
నిలక్కల్ ప్రాంతంలో సిన్సియర్ పోలీసు అధికారిగా పేరు తెచ్చుకుని కేంద్ర మంత్రిని అడ్డుకున్నారనే ఒకే ఒక్క కారణంగా ఐపీఎస్ అధికారి యతీష్ చంద్రను తిరుచూర్ ప్రాంతానికి బదిలి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో యతీష్ చంద్రను బదిలి చేశారా ? మరేమైనా కారణాలు ఉన్నాయా ? అనే విషయం మాత్రం తెలియడం లేదు. సాధారణ బదిలీల్లో భాగంగా ఐపీఎస్ అధికారి యతీష్ చంద్రను బదిలి చేశామని, అందులో ప్రత్యేక ఏమీ లేదని ప్రభుత్వం అంటోంది.