డ్రైవర్తో చెప్పులు తొడిగించుకున్న అసెంబ్లీ స్పీకర్
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ స్పీకర్ ఎన్ శక్తన్ వివాదంలో చిక్కుకున్నారు. తన కారు డ్రైవర్తో ఆయన చెప్పులు తొడిగించుకోవడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం అసెంబ్లీ ఆవరణలో వరిపంట సాగుపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్పీకర్ శక్తన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన తన డ్రైవర్తో కాళ్లకు చెప్పులు తొడిగించుకున్నారు. స్పీకర్ ధరించిన శాండిల్స్కి డ్రైవర్ పట్టీలు బిగిస్తున్న దృశ్యం మీడియా కంట చిక్కింది.
దీంతో విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పించడం మొదలెట్టాయి. కాగా, ఈ విషయమై శక్తన్ గురువారం వివరణ ఇచ్చారు. తాను గత 18 ఏళ్లుగా కళ్లకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నానని, వైద్యులు తనను ముందుకు వంగకుండా ఉండాలని సూచించారని, అందువల్లే తన బంధువు తనకు చెప్పులు తీయడంలో సహాయం చేశాడని ఆయన తెలిపారు.
ఓ ప్రైవేటు కార్య్రక్రమానికి హాజరైనప్పుడు తీసిన ఆ ఫోటోపై చర్చ జరుగుతుండడం తనను కలచి వేసిందని శక్తన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూపించడం తగదన్నారు. 33 ఏళ్లుగా తాను శాసన సభ్యునిగా కొనసాగుతున్నాననీ, తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోకుండా ఈ విషయాన్ని ప్రముఖంగా చూపించడం సరికాదని తెలిపారు.
కాగా, ఇటీవల మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే కూడా సిబ్బందితో చెప్పులు మోయించి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.