పెళ్లి ప్రపొజల్.. యువతి తిరస్కరించిందని పెట్రోల్ దాడి.. ఇద్దరూ బలి..!
ఎర్నాకుళం : ఆ యువతికి 17 ఏళ్లు మాత్రమే. అంటే మేజర్ కూడా కాలేదు. అప్పుడే పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డాడు ఓ యువకుడు. ఆ ప్రతిపాదనను తిరస్కరించింది ఆ అమ్మాయి. దాంతో యువకుడు సైకోగా మారాడు. సదరు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కేరళలో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. పెట్రోల్ దాడిలో ఆ యువతితో పాటు అతడు కూడా బలి కావడం హాట్ టాపికైంది.
ఎర్నాకుళం జిల్లా కక్కనాడ్కు చెందిన 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని దేవిక వెంటపడ్డాడు మిథున్ అనే యువకుడు. పెళ్లి చేసుకుంటానంటూ ప్రపొజల్ పెట్టాడు. అతడి ప్రతిపాదనను సదరు యువతి తిరస్కరించడంతో ఏకంగా వారి ఇంటికెళ్లాడు. ఆ అమ్మాయి పేరెంట్స్తో పెళ్లి గురించి మాట్లాడాడు. అయితే దేవిక మైనర్ కావడం.. ఆ యువకుడి తీరు నచ్చకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్లికి నో చెప్పారు. దాంతో కక్ష పెంచుకున్న మిథున్ అదను చూసి పంజా విసిరాడు.
50 వేల జీతాలెక్కడ సీఎం గారూ.. పే స్లిప్పులతో వినూత్న నిరసన..!
ఆ క్రమంలో బుధవారం (09-10-2019) నాడు దేవిక వెళ్లే ట్యూషన్ సెంటర్కు వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా రాత్రి ఆమె ఇంటికి వెళ్లి నానా రచ్చ చేశాడు. పెళ్లికి అంగీకరించాలని ఎంత పట్టుబట్టినా.. దేవిక వినిపించుకోకపోవడంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటలు కాస్తా మిథున్కు కూడా అంటుకోవడంతో ఇద్దరూ బలయ్యారు. ఈ ఘటనలో దేవిక తండ్రికి గాయాలయ్యాయి.
మిథున్ ప్రవర్తనపై దేవిక తల్లిదండ్రులు గతంలోనే హెచ్చరించినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారట. అయితే కేసు నమోదు చేయని పోలీసులు.. మిథున్ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా కూడా అతడిలో మార్పు రాకపోగా.. దేవికను ఇంకా వేధించడం మొదలుపెట్టాడు. చివరకు తనతో పెళ్లికి అంగీకరించడం లేదని కక్ష పెంచుకుని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు.