కోవిడ్ 19 నిబంధనలు... ఏడాది వరకు పాటించాల్సిందే... కేరళ కీలక నిర్ణయం...
కరోనా వైరస్ నియంత్రణకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిబంధనలను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫిజికల్ డిస్టెన్స్,బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్,సామూహిక సమావేశాల రద్దు వంటి నిబంధనలు జూలై 2021 వరకూ కొనసాగనున్నాయి. ఈ మేరకు కేరళ ప్రభుత్వం స్టేట్ ఎపిడెమిక్ డిసీజ్ ఆర్డినెన్స్ 2020కు సవరణలు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ ఉత్తర్వులను అమలుచేసేందుకు ఆదేశాలిచ్చింది.
పెళ్లిళ్లకు 50 మంది,అంత్యక్రియలకు 20 మంది...
బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరూ ముక్కు,నోరు కవర్ అయ్యేలా ఫేస్ మాస్క్ ధరించాలి. అలాగే ప్రయాణాల్లోనూ మాస్క్ తప్పనిసరి. బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్నప్పుడు వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆరడుగుల దూరం పాటించాలి. వివాహాలు,ఇతరత్రా శుభాకార్యాలకు గరిష్టంగా 50 మందికి మించి హాజరవ్వద్దు. శుభాకార్యాల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరూ శానిటైజర్,ఫేస్ మాస్క్ ధరించాలి.ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి. శుభకార్యాలు లేదా ఆ వేడుకలను ఏర్పాటు చేసే నిర్వాహకులు అతిథులకు తప్పనిసరిగా శానిటైజర్ అందుబాటులో ఉంచాలి.అంత్యక్రియలకు గరిష్టంగా 20 మందికి మించి హాజరవ్వద్దు. అంత్యక్రియల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరూ శానిటైజర్,ఫేస్ మాస్క్ ధరించాలి.ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి. ఒకవేళ కరోనా అనుమానిత మృతి కేసు అయితే... కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి.
వాటికి అనుమతి తప్పనిసరి...
గెట్ టుగెదర్,ఊరేగింపులు,ధర్నాలు,సదస్సులు,ప్రదర్శనలు ఇతరత్రా వాటికి తప్పనిసరిగా సంబంధిత అధికారుల అనుమతి ఉండాలి. ఒకవేళ అనుతి లభించినా.. 10 మందికి మించి పాల్గొనకూడదు. అక్కడ కూడా ఫిజికల్ డిస్టెన్స్,ఫేస్ మాస్క్,శానిటైజర్ ఉపయోగించడం తప్పనిసరి. ఒక షాపులో ఒక్కసారి 20 మందికి మించి కస్టమర్లను అనుమతించరాదు. షాప్ సైజును బట్టి ఫిజికల్ డిస్టెన్స్ నిబంధనను దృష్టిలో పెట్టుకుని ఆ చర్యలు తీసుకోవాలి.
ట్రాన్స్పోర్ట్ రద్దు...
బహిరంగ ప్రదేశాలు,రోడ్లు,ఫుట్పాత్లపై ఉమ్మివేయడం నిషేధం. ఇతర రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారు 'కోవిడ్19 జాగ్రత ఈ-ప్లాట్ఫామ్'లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. కేరళ నుంచి లేదా కేరళకు వచ్చే.. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్పై నిషేధం కొనసాగుతుంది. ఈ నిబంధనలన్నీ వచ్చే ఏడాది జూలై వరకు అమలులో ఉంటాయి. కాగా,దేశంలో మొట్టమొదటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు కేరళలోనే నమోదైన సంగతి తెలిసిందే. అయితే అక్కడి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగింది. గతంలో నిఫా వంటి వైరస్లను హ్యాండిల్ చేసిన అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడింది. ప్రస్తుతం కేరళలో 5430 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ 26 మంది కరోనాతో మృతి చెందారు.