సీఏఏపై క్లాస్రూమ్లో టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా..?
పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని వ్యతిరేకిస్తున్నవారు పాకిస్తాన్ వెళ్లిపోవాలంటూ ఓ స్కూల్ టీచర్ క్లాస్రూమ్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు హెడ్మాస్టర్కు ఫిర్యాదు చేయడంతో సదరు టీచర్పై వేటు తప్పలేదు. కేరళలోని త్రిసూర్ జిల్లా కొడుంగళ్లూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కొడుంగళ్లూర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో హిందీ టీచర్గా పనిచేస్తున్న కలేషన్ అనే టీచర్..ఇటీవల సీఏఏపై క్లాస్రూమ్లో మాట్లాడారు. సీఏఏని వ్యతిరేకిస్తున్నవారు ఎవరైనా ఉంటే.. వాళ్లు పాకిస్తాన్ వెళ్లిపోవాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. టీచర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను విద్యార్థులు హెడ్మాస్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సదరు టీచర్ కొన్నిసార్లు తమతో అసభ్యంగానూ మాట్లాడుతున్నట్టు చెప్పారు. దీంతో కలేషన్ను స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
కాగా,సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం మాత్రం సీఏఏ అమలుపై వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. సీఏఏని వ్యతిరేకించేవాళ్లను కుక్కల్లా కాల్చిపారేయండి అంటూ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఇటీవల వ్యాఖ్యానించారు. అంతకుముందు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా సీఏఏని సమర్థిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏని నిరసిస్తూ ప్రధాని మోదీ,యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణం ఉండగానే పాతిపెట్టేస్తా అని హెచ్చరించారు. ఏదేమైనా సీఏఏపై వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.