20 తరువాత..ఢిల్లీ ఫార్ములా: వాహనాలకు అడ్డుకట్ట: ఆ విధానాన్ని అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా
తిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రస్తుతం దేశంలో రెండోదశ లాక్డౌన్ కొనసాగుతోంది. వచ్చేనెల 3వ తేదీ వరకు 19 రోజుల పాటు కొనసాగే ఈ లాక్డౌన్ను ఈ నెల 20వ తేదీ తరువాత సడలించబోతోంది కేంద్ర ప్రభుత్వం. లాక్డౌన్ను పూర్తిగా హాట్స్పాట్లు, రెడ్ జోన్లకే పరిమితం చేయనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ఇదివరకే వెల్లడించింది. దీనికి అనుగుణంగా నడుచుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
వాహన ప్రవాహానికి ఆ రంకంగా అడ్డుకట్ట
ఈ నెల 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపును దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని రకాల వాహనాలు రోడ్ల మీదికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజా రవాణాకు అనుమతి లేనప్పటికీ.. ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలు పోటెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే.. కరోనా వైరస్ను స్వయంగా ఆహ్వానించినట్టవుతుందనే అభిప్రాయాన్ని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకేసారి వాహనాలన్నీ రోడ్డు మీదికి వస్తే.. సోషల్ డిస్టెన్సింగ్ను పాటించడం కష్టతరమౌతుందని భావిస్తున్నాయి.
దీన్ని నివారించడానికి ఢిల్లీ ఫార్ములా
వాహన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి కేరళ ప్రభుత్వం ఢిల్లీ ఫార్ములాను అనుసరించబోతోంది. సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకుని రానుంది. ఫలితంగా వాహనాల రద్దీని నియంత్రించడానికి అవకాశం ఉంటుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. సరి-బేసి విధానాన్ని అమలు చేయడం వల్ల ఇదివరకు ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని నియంత్రించగలిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము అదే ఫార్ములాను ఈ నెల 20వ తేదీన ప్రవేశపెడతామని అన్నారు.
నాలుగు జిల్లాల్లో సడలింపు ఉండదంటూ..
కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న నాలుగు జిల్లాల్లో ఎలాంటి మార్పులు గానీ, సడలింపు గానీ ఉండబోదని విజయన్ తెలిపారు. కాసర్గోడ్, కన్నూరు, మళప్పురం, కోజికోడ్ జిల్లాల్లో వైరస్ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయని, ఆయా జిల్లాల్లో ఎలాంటి సడలింపు ఉండదని చెప్పారు. వచ్చే నెల 3వ తేదీ వరకు లాక్డౌన్ యధాతథంగా అమలు చేస్తామని అన్నారు. పత్తినంథిట్ట, ఎర్నాకుళం, కొల్లం, అళప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిశూర్, వయనాడ్లల్లో పాక్షికంగా సడలింపు ఉంటుందని చెప్పారు. జీరో కేసులు నమోదైన కొట్టాయం, ఇడుక్కిల్లో 60 శాతం మేరకు సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.
సరి-బేసి విధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకుని వచ్చిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది కేరళ. తొలిసారిగా ఈ విధానాన్ని అరవింద్ కేజ్రీవాల ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ.. దాన్ని వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి వినియోగించింది. కరోనా వైరస్ విస్తరించడాన్ని నివారించడానికి కూడా ఢిల్లీ ఫార్ములాను అనుసరించడం దేశంలో ఇదే తొలిసారి అవుతుంది.
Recommended Video