వరద నష్టాలు..జనం నుంచే వసూలు! జీఎస్టీకి అదనంగా సెస్ విధించిన సర్కార్!
తిరువనంతపురం: ప్రకృతి వైపరీత్యాలు మిగిల్చే నష్టం ఎంతో మనకు తెలుసు. వరదలు ముంచెత్తినప్పుడు సంభవించే నష్టాన్ని మాటల్లో వర్ణించలేం. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు కలిగించే నష్టాలు వేల కోట్ల రూపాయల్లోనే ఉంటాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సహాయ, పునరావాస చర్యల కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రభుత్వానికి. పంట నష్ట పరిహారాన్ని చెల్లించడం, రోడ్లను మరమ్మతు చేయడం, చెరువులకు పూర్వ వైభవాన్ని తీసుకుని రావడం అంటే మాటలు కాదు. ఖర్చుతో కూడుకున్న పని. ఇదంతా-అదనపు ఖర్చుగానే భావిస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు.
వైఎస్ జగన్ టీమ్లో రత్నప్రభ, రమాకాంత్ రెడ్డి? శ్రీలక్ష్మికి కీలక హోదా!
దీన్ని అధిగమించడానికి కేరళ ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచన చేసింది. దాన్ని అమల్లో పెట్టేసింది కూడా. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు సంభవించినప్పుడు కలిగే నష్టాన్ని ప్రజల నుంచే వసూలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా సెస్ను విధించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న సరుకులు, సేవా పన్నుల మీద అదనంగా ఒక శాతం సెస్ను విధించింది కేరళలోని వామపక్ష ప్రభుత్వం. దీనికి సంబంధించిన జీవోలను కూడా జారీ చేసింది. ఈ సెస్ జూన్ 1 నుంచి అమలులోకి రానుంది.
సాధారణంగా- మనం బిల్లుల రూపంలో చెల్లించే నగదు జీఎస్టీ రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు చేరుతుంది. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సగం సగం తీసుకుంటాయి. కేరళలో విధించిన ఒక శాతం సెస్ ఆ రాష్ట్ర ఖజానాకు అదనంగా చేరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2019-2020లో కనీసం 600 కోట్ల రూపాయలు సెస్ రూపంలో అందుతాయని కేరళ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మొత్తాన్ని వరద బాధితుల సహాయ, పునరావాసాల కోసం ఖర్చు చేస్తుంది.
కాగా- గత ఏడాది సంభవించిన వరదలు కేరళ మొత్తాన్నీ ముంచెత్తిన విషయం తెలిసిందే. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా నష్టపోయారు మలయాళీలు. వేల గృహాలు నేలమట్టం అయ్యాయి. గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుని పోయాయి. వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఇప్పటికీ- ఆ నష్టాన్ని పూడ్చుకోలేక సతమతమౌతోంది కేరళ ప్రభుత్వం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక శాతం సెస్ను విధించింది. వచ్చేనెల 1 నుంచి ఈ సెస్ అమల్లోకి రానుంది.