లేని రోగం అంటగట్టి.. ట్రీట్మెంట్తో జీవచ్ఛవంలా మార్చి.. కేరళలో గవర్నమెంట్ డాక్టర్ల నిర్వాకం..
కొట్టాయం : కేరళలో అదో పెద్దాసుపత్రి. వైద్యం కోసం నిత్యం వేల మంది వస్తుంటారు. కొట్టాయంకు చెందిన ఓ మహిళ కూడా అదే నమ్మకంతో ట్రీట్మెంట్ కోసం వచ్చింది. ఆమెను పరిశీలించిన డాక్టర్లు ఆమెకు లేని రోగం అంటగట్టారు. ఓ ప్రైవేటు ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ట్రీట్మెంట్ ఇచ్చి చుక్కలు చూపించారు. అసలు విషయం తెలిసి సదరు మహిళ నిలదీయడంతో డాక్టర్లు చేతులెత్తేశారు.
మళ్లీ నిఫా కలకలం.. కేరళలో మహమ్మారి ఆనవాళ్లు..?
బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు తేల్చిన డాక్టర్లు
కొట్టాయంకు చెందిన రజనీ అనే 38 ఏళ్ల మహిళ ఉద్యోగం చేస్తూ కూతురుతో కలిసి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే కొంతకాలం క్రితం రొమ్ములో చిన్న కణితి ఉన్నట్లు అనుమానం రావడంతో కొట్టాయం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్కు వెళ్లింది. అక్కడ ఆమెను పరిశీలించిన డాక్టర్లు దాన్ని క్యాన్సర్ కణితిగా అనుమానించారు. బయాప్సీ కోసం కణితి ముక్కలను హాస్పిటల్లోని ల్యాబ్తో పాటు ఓ ప్రైవేట్ ల్యాబొరేటరీకి పంపారు. ప్రైవేట్ ల్యాబ్ రిపోర్టు త్వరగా అందడంతో దాని ఆధారంగా రజనికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్థారించిన డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు.
కీమోథెరపీ ట్రీట్మెంట్
బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా రజనికి కీమోథెరపీ ఇవ్వాలని డాక్టర్లు డిసైడ్ అయ్యారు. మార్చిలో మొదటి విడత కీమోథెరపీ చికిత్స పూర్తైంది. ఆ తర్వాత హాస్పిటల్లో చేసిన పరీక్షల రిపోర్టు అందడంతో అది చూసి సదరు మహిళ నివ్వెరపోయింది. అందులో ఆమెకు క్యాన్సర్ లేదని తేలడంతో అదే విషయాన్ని డాక్టర్ల దృష్టికి తెచ్చింది. దీంతో మరోసారి బయాప్సీ నిర్వహించిన వైద్యులు క్యాన్సర్లేదని తేలడంతో నాలుక్కరుచుకున్నారు.
సైడ్ ఎఫెక్ట్స్తో సతమతం
క్యాన్సర్ లేకున్నా కీమో థెరపీ చికిత్స నిర్వహించడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. జట్టు విపరీతంగా రాలిపోయింది. శరీరం నీరసించిపోవడంతో ఆమె పనికి కూడా వెళ్లలేకపోతోంది. ఫలితంగా రజని ఎనిమిదేళ్ల కూతురుతో పాటు ఆమెపై ఆధారపడ్డ వృద్ధ తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాధి నిర్థారణ కాకముందే డాక్టర్లు వైద్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. విషయం ప్రభుత్వం దృష్టికి చేరడంతో వైద్య శాఖ మంత్రి ఎంక్వైరీకి ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.