రైతును పెళ్లాడిన కేరళ మహిళా మంత్రి ( వీడియో)
వేనాడ్ (కేరళ) : కేరళ ప్రభుత్వంలో ఏకైక మహిళామంత్రిగా కొనసాగుతున్న పీకే జయలక్ష్మి రైతును వివాహం చేసుకున్నారు. సీఏ అనిల్కుమార్ను హిందూ గిరిజన సంప్రదాయ పద్ధతిలో పెండ్లి చేసుకున్నారు. కురిచియ సంప్రదాయ పద్ధ్దతిలో నిర్వహించిన వివాహ కార్యక్రమంలో మంత్రి జయలక్ష్మి మెడలో వరుడు అనిల్ కుమార్ మూడుమూళ్లు వేశారు.
ఆ తర్వాత సీఎం ఊమెన్ చాందీ, ప్రతిపక్ష నేత అచ్యుతానందన్ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. మనంథవాడీ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికైన జయలక్ష్మి చాందీ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ, యువజన సర్వీసుల మంత్రిగా సేవలందిస్తున్నారు.
ఉత్తర కేరళ జిల్లాలో ఈ వివాహం భారీ కార్యక్రమమైంది. రమేష్ చెన్నితల, కెసి జోసెఫ్, స్పీకర్ ఎన్ శక్తన్లతో పాటు పలువురు మంత్రులు ఈ వివాహానికి హాజరయ్యారు.
వరుడు అనిల్ కుమార్ తెల్లటి చొక్కా, ముండు ధరించి వధువు మెడలో తాళి కట్టారు. ఈ వివాహాన్ని స్థానిక టెలివిజన్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. దాదాపు 30 ఏళ్ల వయస్సు గల జయలక్ష్మి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు.