కేశవానంద భారతి కన్నుమూత: దేశ చరిత్రలో సుదీర్ఘ కాలం: ల్యాండ్మార్క్ కేసులకు కేరాఫ్
తిరువనంతపురంః కేరళలోని ఎడ్నేర్ మఠాధిపతి స్వామి కేశవానంద భారతి కృష్ణైక్యం అయ్యారు. ఆయన వయస్సు 79 సంవత్సరాలు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని ఎడ్నేర్ మఠం ఆస్తుల పరిరక్షణ కోసం ఆయన సాగించిన న్యాయపోరాటం.. దేశ చరిత్రలో నిలిచిపోయింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన కేసుగా గుర్తింపు పొందింది.
అనేక కేసులకు ల్యాండ్మార్క్
కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం మధ్య నడిచిన కేసు 68 రోజుల పాటు కొనసాగింది. 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం దీన్ని విచారించింది. అనేక వ్యాజ్యాలపై తీర్పును వెలువరించడంలో ఇప్పటికీ సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసును పరిగణనలోకి తీసుకుంటుంది. కేరళ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భాగంగా ఎడ్నేర్ మఠం ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను కేశవానంద భారతి అడ్డుకున్నారు. న్యాయపోరాటం చేశారు. చారిత్రాత్మక, దేశ చరిత్రను మలుపు తిప్పే శక్తి సామర్థ్యాలు ఉన్న కేసుగా కేశవానంద భారతి కేసు గుర్తింపు పొందింది.
13 మంది ధర్మాసనం..
1973లో స్వామి కేశవానంద భారతి శ్రీపాదగల్వరు, కేరళ ప్రభుత్వం మధ్య ఈ కేసు కొనసాగింది. కేశవానంద భారతి ఆశ్రమానికి చెందిన మఠాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ ఈ కేసు దాఖలైంది. అయిదు మంది కాదు.. 10 మంది కాదు.. ఏకంగా 13 మంది న్యాయమూర్తులతో ఏర్పాటైన ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. చరిత్ర గతినే మార్చివేసిన కేసుగా దీన్ని అభివర్ణిస్తుంటారు న్యాయరంగానికి చెందిన విశ్లేషకులు. ఈ కేసు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్లుగా చెబుతుంటారు.
జస్టిస్ ఎస్ ఎం సిక్రీ సారథ్యంలో..
1973లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎం సిక్రీ నేతృత్వంలో జేఎం షెలట్, కేఎస్ హెగ్డే, ఏఎన్ గ్రోవర్, బీ జగన్మోహన్ రెడ్డి, డీజీ పాలేకర్, హెచ్ ఆర్ ఖన్నా, ఏకే ముఖర్జీ, యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ఏఎన్ రాయ్, కేకే మాథ్యూ, ఎంహెచ్ బేగ్, ఎస్ ఎన్ ద్వివేదీ ఈ కేసును విచారించారు. 68 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసు కేశవానంద భారతికి అనుకూలంగా వెలువడింది. 13 మంది న్యాయమూర్తుల్లో నలుగురు ఈ తీర్పును వ్యతిరేకించారు. తీర్పు ప్రతులపై సంతకాలు చేయలేదు. ఈ కేసు ఆధారంగా రాజ్యాంగాన్ని కూడా సవరించారని చెబుతుంటారు.
ఆ తరువాత అయోధ్య..
కేశవానంద భారతి కేసు తరువాత.. ఆ స్థాయిలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన మరో వ్యాజ్యాం.. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం. 40 రోజుల పాటు విచారణ కొనసాగింది. అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణను కొనసాగించింది. అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రదేశంగా భావిస్తోన్న 2.77 ఎకరాల స్థలాన్ని రామ్ లల్లా విరాజ్ మాన్, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డులకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ కేసు దాఖలైంది. అప్పటి నుంచీ గత ఏడాది అక్టోబర్ 16వ తేదీ వరకు విచారణ కొనసాగింది. తీర్పు రామజన్మభూమికి అనుకూలంగా వెలువడిన విషయం తెలిసిందే.