నితీష్కు పాశ్వాన్ గుడ్బై చెప్పేస్తారా..? ఒంటరిగానే బీహార్ బరిలోకి..!
పాట్నా: బీహార్లో నితీష్ కుమార్కు సొంత కూటమి నుంచే కష్టాలు ఎదురవుతున్నాయి. త్వరలో బీహార్కు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నితీష్ కుమార్ ప్రచారం ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో లోక్జన్శక్తి (ఎల్జేపీ) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో కలిసి ప్రయాణం చేయాలా లేదా మరొకరితో వెళ్లాలా అని చర్చించేందుకు చిరాగ్ పాశ్వాన్ అతని తండ్రి కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్లు ఈ రోజు ముఖ్యనాయకులతో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
గత కొన్ని నెలలుగా జేడీయూ మరియు ఎల్జేపీల మధ్య అంతరం పెరుగుతోంది. విబేధాలు సైతం తారాస్థాయికి చేరుకున్నాయి. కరోనావైరస్ పరిస్థితిని ఎదుర్కోవడంలో నితీష్ ప్రభుత్వం విఫలమైందని అదే సమయంలో వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తినప్పుడు కూడా ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎల్జేపీ నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా దేశాన్ని కుదిపేస్తోన్న బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి కేసులో విచారణ చేయించేందుకు నితీష్ ప్రభుత్వం ముందుకురాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక మరో దళిత నేత మాజీ ముఖ్యమంత్రి అయిన జితన్ రామ్ మాంఝీతో కలిసి వెళదామనుకున్నా అక్కడా సంబంధాలు చెడిపోయాయి.
ఇక దళితులకు గిరిజనులకు ఉచితంగా భూమి ఇస్తామన్న హామీని నితీష్ కుమార్ గాలికొదిలేసారని పేర్కొంటూ ఘాటు లేఖను సీఎంకు చిరాగ్ పాశ్వాన్ రాశారు. అంతేకాదు 15 ఏళ్ల నితీష్ కుమార్ పాలనలో మృతి చెందిన దళితులు గిరిజనుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే బీజేపీని మాత్రం చిరాగ్ పాశ్వాన్ ఎక్కడా టార్గెట్ చేయలేదు. తన తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ మోడీ కేబినెట్లో మంత్రిగా ఉన్నందున బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. అయితే పార్టీ ముఖ్యులో జరగనున్న సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కాకుండా కేవలం నితీష్ కుమార్ పార్టీ జేడీయూకు మాత్రమే వ్యతిరేకంగా పోటీ చేయాలని నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
2005లో ఇదే తరహా వ్యూహం ఎల్జేపీకి వర్కౌట్ అయ్యింది. ఆ సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి అధికారంలోకి రాకుండా రాంవిలాస్ పాశ్వాన్ కదిపిన పావులకు అనుకున్న ఫలితం తీసుకువచ్చింది. కాంగ్రెస్, ఆర్జేడీ, ఎల్జేపీలు పోటీచేయగా ఆర్జేడీ అభ్యర్థులు పోటీ చేసిన చోటు ఎల్జేపీ అభ్యర్థులను నిలిపారు పాశ్వాన్. దీంతో 2005లో హంగ్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్లీ జరిగిన ఎన్నికల్లో జేడీయూ ఘనవిజయం సాధించి నితీష్ కుమార్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు.
మొత్తానికి జేడీయూ- బీజేపీ కూటమికి వ్యతిరేకంగా తమ అభ్యర్థులను నిలపాలని పాశ్వాన్ నిర్ణయిస్తే ఇది విపక్ష పార్టీకి మేలు చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే నెలలో ఎన్నికల కమిషన్ బీహార్ అసెంబ్లీకి సంబంధించి షెడ్యూలును విడుదల చేయనుంది.