రిటైర్మెంట్ టైమ్: 20 రోజుల్లో 10 కీలక తీర్పులు ఇవ్వనున్న సీజే దీపక్ మిశ్రా
ఢిల్లీ: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పదవీ విరమణ చేసేందుకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే కనీసం 10 కీలక కేసుల్లో తీర్పు ఇవ్వనున్నారు జస్టిస్ దీపక్ మిశ్రా.ఇందులో రాజకీయంగా సున్నితమైన అంశం రామజన్మభూమి వివాదంపై కూడా ఆయన తీర్పు ఇవ్వనున్నారు.
అంతేకాదు ఆధార్ , బయోమెట్రిక్ విధానంపై కూడా జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం కీలక తీర్పును ఇవ్వనుంది. ఆధార్ రాజ్యాంగ బద్దమైనదే అనేదాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్తలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 38 రోజుల వాదనల తర్వాత మే10 తీర్పును నాలుగు నెలల పాటు రిజర్వ్లో ఉంచింది.
సెక్షన్ 377పై కూడా రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెల్లడించనుంది. హోమో సెక్సువాలిటీ నేరం కాదని తెలుపుతూ దాఖలైన పిటిషన్పై వాదనలు ముగిశాయి. జూలై 17న తీర్పును రిజర్వ్ చేసింది అత్యున్నత ధర్మాసనం. మసీదు ఇస్లాం మతంలో భాగమేనా అనే దానిపై దాఖలైన పిటిషన్లో కూడా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది.
రామజన్మభూమి - బాబ్రీ మసీదులో తీర్పు ఇవ్వకముందే మసీదు అంశంపై తీర్పు ఇవ్వాల్సి ఉంది. మసీదు ఇస్లాం మతంలో భాగం కాదని 1994లో రూలింగ్ ఇచ్చిన జస్టిస్ ఫరూకి తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం సంస్థలు సుప్రీంను ఆశ్రయించాయి. జూలై 20న త్రిసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఒకవేళ త్రిసభ్య ధర్మాసనం ముస్లిం సంస్థలకు అనుకూలంగా తీర్పునిస్తే.. ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి కేసు బదిలీ చేయడం జరుగుతుంది. ఇలాంటి తీర్పుతో పాటు మరికొన్ని కీలక తీర్పులను జస్టిస్ దీపక్ మిశ్రా ఇవ్వనున్నారు. ఇవి కచ్చితంగా ప్రభావం చూపిస్తాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీలకు ప్రమోషన్లపై 2006లో నియంత్రణ విధించింది సుప్రీం కోర్టు. ఆ తీర్పును ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ పునఃసమీక్షించాల్సిందిగా కోరింది. ఈ తీర్పు కూడా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చెప్పనుంది. మరో కీలక కేసులో కూడా తీర్పు ఇవ్వాల్సి ఉంది సుప్రీం కోర్టు.
ఓ వైపు చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహిస్తూ మరో వైపు లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న కేసులో కూడా తీర్పు చెప్పాల్సి ఉంది. క్రిమినల్ ఆరోపణలు ఉన్న ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో పోటీచేసేలా వీలులేకుండా వారిపై అనర్హత వేటు వేయడం అనే కేసులో కూడా తీర్పు ఇవ్వనుంది. అక్టోబర్ 2న ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా పదవీవిరమణ చేయాల్సి ఉన్నా... సాంకేతిక కారణాలతో అక్టోబర్ 1నే తర చివరి పనిదినంగా పరిగణిస్తారు.