జిల్లాకు 5 లక్షల మంది టార్గెట్: సూపర్ స్టార్ నిర్ణయం, దళితులకే, రజనీ ఫ్యాన్స్ కు!
చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన స్థాపించనున్న రాజకీయ పార్టీకి అనుభందంగా ఏర్పాటు చేసిన రజనీ మక్కల్ మండ్రంలో జిల్లాకు ఐదు లక్షల మంది సభ్యుల్ని చేర్చడం లక్ష్యంగా నిర్ణయించారు. చెన్నైలో శుక్రవారం రజనీ మక్కల్ మండ్రం ఏర్పాటు అయ్యింది. ఇక తమిళనాడులోని అన్ని జిల్లాల్లో రజనీ మక్కల్ మండ్రం విస్తరించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
చెన్నైలో తొలి అడుగు
చెన్నైలోని చేట్ పేట్ లోని మంగళాపురంలో రజనీ మక్కల్ మండ్రంను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు. రజనీ మక్కల్ మండ్రం నిర్వాహకులు, తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రజనీకాంత్ స్థాపించే కొత్త పార్టీలో చేరాలని ఆయన అభిమానులు ప్రజలకు మనవి చేశారు.
50 శాతం టార్టెట్ పూర్తి
తమిళనాడులోని తిరుప్పూర్ లోని రజనీకాంత్ అభిమానుల్ని ఏకం చేస్తూ ఓ సమావేశం నిర్వహించారు. రజనీ మక్కల్ మండ్రంకు తిరుప్పూర్లో ఇప్పటికే రెండున్నర లక్షల మంది సభ్యులు చేరారని, మరో రెండున్నర లక్షల మందిని అతి త్వరలో చేర్పిస్తామని రజనీకాంత్ అభిమాన సంఘాల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అభిమానులు, ప్రజలు
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కసరత్తుల్లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ముందుగా తన అభిమానుల్ని ఏకం చేస్తూ ప్రజల్ని, మద్దతుదారుల్ని ఆకర్షించడానికి కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ రజనీ మక్కల్ మండ్రంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఫ్యాన్స్ కు పదవులు
రజనీ మక్కల్ మండ్రంలో సభ్యులను చేర్పించేందుకు సూపర్ స్టార్ అభిమానులు పరుగులు తీస్తున్నారు. అదే సమయంలో రజనీ మక్కల్ మండ్రంలో అభిమానులకు ఎలంటి పదవులు లేకపోవడంతో అందుకు తగ్గ కార్యాచరణపై రజనీకాంత్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
జిల్లాకు 5 లక్షల మంది
తమిళనాడులోని అన్ని జిల్లాల వారీగా రజనీ మక్కల్ మండ్రంకు కార్యవర్గాలను ప్రకటించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ కసరత్తులు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో 5 లక్షల మంది సభ్యులను రజనీ మక్కల్ మండ్రంలో చేర్పించడానికి కృషి చెయ్యాలని రజనీకాంత్ తన అభిమాన సంఘాల నాయకులకు సూచించారు.
దళితులకు అగ్రస్థానం
రజనీ మక్కల్ మండ్రంలో ముఖ్యంగా దళితులు, మైనారిటీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయ్యాలని, అలాగే అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని రజనీ మక్కల్ మండ్రంలో కార్యవర్గాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూపర్ స్టార్ రజనీకాంత్ నిర్ణయించారని తెలిసింది.
ఆరోజు పార్టీ పేరు
తమిళనాడులోని ప్రతి జిల్లాలో రజనీ మక్కల్ మండ్రంలో కనీసం ఐదు లక్షల మంది సభ్యుల్ని చేర్పించిన తరువాత తన కొత్త పార్టీ ప్రకటన చెయ్యాలని సూపర్ స్టార్ రజనీకాంత్ నిర్ణయించారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రతి జిల్లాలో ఐదు లక్ష మంది చేరితో దాదాపు 1. 70 కోట్ల మంది సభ్యత్వం తీసుకున్న తరువాత పార్టీని భలోపేతం చెయ్యాలని రజనీకాంత్ నిరీక్షిస్తున్నారని తెలిసింది.