కేజ్రీవాల్ మంత్రివర్గ కూర్పు: రాఖీ బిర్లాకు మొండిచేయి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గం కూర్పుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేత రాఖీ బిర్లాకు ఈసారి మంత్రి పదవి దక్కకపోవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. గత 49 రోజుల పాలనలో రాఖీ బిర్లా మహిళా, శిశు, సామాజిక సంక్షేమ మంత్రిగా పనిచేశారు. ఆమెను పక్కన పెట్టడానికి గల కారణాలేమిటనేది తెలియడం లేదు.
ఇదిలావుంటే, శాసనసభ్యులు జర్నైల్ సింగ్, మనీషా సిసోడియా, గోపాల్ రాయ్, ఆదర్శ శాస్త్రిలకు ప్రభుత్వంలో కీలకమైన పదవులు లభించే అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 14వ తేదీన రాంలీలా మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేజ్రీవాల్ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీని, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్లను కూడా ఆహ్వానించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కౌశాంబి నుంచి రామ్లీలా మైదానం వరకు రోడ్డు షో నిర్వహించనుంది.
ఇదిలావుంటే, బిజెపి మీడియా సమన్వయకర్త ప్రవీణ్ శంకర్ కపూర్ రాజీనామా చేశారు. బిజెపి ఓటమికి కిరణ్ బేడీని బాధ్యురాలిగా చేయడం సరి కాదని ఆ పార్టీ మిత్రపక్షం శివసేన వ్యాఖ్యానించింది.