అక్రమ సంబంధమే హత్యకు కారణం: ఖలిస్తాన్ అగ్రనేత హర్మీత్ హత్యలో కొత్త ట్విస్ట్
లాహోర్ : కొద్దిరోజుల క్రితం పాకిస్తాన్లోని లాహోర్లో దారుణ హత్యకు గురయ్యాడు ఖలిస్తానీ నాయకుడు హర్మీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పీహెచ్డీ. అయితే అతని హత్యకు కారణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముందుగా ఆర్థికపరమైన విబేధాలు రావడంతో హత్యకు గురయ్యాడనే వార్తలు వచ్చాయి. అయితే అసలు కారణం మరొకటని తెలిసింది. హర్మీత్ సింగ్ ఓ ముస్లిం యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే హత్యకు గురయ్యాడని తాజా సమాచారం. ఇదే విషయమై భారత ఇంటెలిజెన్స్ వర్గాలు మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నం చేస్తోంది.
ఆర్థికపరమైన విబేధాలు తలెత్తడంతోనే హర్మీత్ సింగ్ను లోకల్ గ్యాంగ్స్కు చెందిన కొందరు హత్య చేసి ఉంటారనే వార్త బయటకొచ్చింది. అయితే ఓ ముస్లిం మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే హత్యకు గురయ్యాడనేది తాజా సమాచారం. ముస్లిం మహిళ భర్త పలుమార్లు హర్మీత్ సింగ్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అయితే హర్మీత్ సింగ్ మాత్రం ఆ హెచ్చరికలను బేఖాతారు చేసి ఆమెతో అక్రమ సంబంధం ఇంకా నెరపుతుండటంతోనే హత్యకు గురై ఉంటాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇదిలా ఉంటే తన కొడుకు మృతదేహంను తమకు అప్పగించాలని హర్మీత్ తల్లిదండ్రులు కోరారు. అయితే పాకిస్తాన్లోనే అతన్ని ఖననం చేశారు. డేరా చాహల్ స్టేషన్ పరిధిలో ఎస్పీ ర్యాంక్ హోదాలో ఉన్న అధికారి సమక్షంలో హర్మీత్ సింగ్ అంత్యక్రియలు ముగిసినట్లు తెలుస్తోంది.
హర్మీత్ సింగ్ అంత్యక్రియలు బాబు సాబు చౌక్ స్మశాన వాటికలో పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. తమ కొడుకు మృతదేహం తమకు అప్పగించాల్సిందిగా తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినప్పటికీ అది జరగదని పాక్ అధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. హర్మీత్ సింగ్ భారత్లో పలు నేరాలకు పాల్పడటంతో ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో చేరాడు. ఇప్పటికే పంజాబ్ పోలీస్ శాఖ 9 రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది.
హర్మీత్ సింగ్ అమృత్సర్లోని చెహర్తాలో నివాసం ఉండేవాడు. అతనికి డాక్టొరేట్ కూడా ఉండటంతో అతన్ని అందరూ పీహెచ్డీ అని పిలిచేవారు. ఇక పాకిస్తాన్లో గత 20 ఏళ్లుగా నివసిస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది ఖలిస్తాన్ ఉగ్రవాదులపై ఇంటర్పోల్ రెడ్ నోటీసులు జారీ చేసింది. భారత్ ఇచ్చిన సమాచారంతో హర్మీత్ పై కూడా రెడ్ నోటీసులు జారీ చేసింది ఇంటర్పోల్. పాకిస్తాన్ గడ్డపై నుంచి కొన్ని విధ్వంసాలకు హర్మీత్ సింగ్ ప్లాన్ చేశాడు.