మోడీ సర్కార్కు సుప్రీంకోర్టు డెడ్లైన్: మళ్లీ అఫిడవిట్: నాడు వైఎస్ జగన్ వ్యవహారంలో: నేడు..?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రోజుల తరబడి రైతులు కొనసాగిస్తోన్న నిరసన దీక్షల్లో నిషేధిత ఖలిస్తాన్ నాయకులు పాల్గొంటున్నారనే వార్తలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ నిరసన దీక్షలను అడ్డుగా పెట్టుకుని ఖలిస్తాన్ నాయకులు రైతాంగాన్ని రెచ్చగొడుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చింది. దీనిపై సాక్ష్యాధారాలు ఉంటే తమకు సమర్పించాలని ఆదేశించింది. ప్రత్యేకంగా ఓ అఫిడవిట్ను అందజేయాలని సూచించింది.
కేంద్రానికి హైఓల్టేజ్ షాక్: మూడు వ్యవసాయ చట్టాలిక చెల్లవ్: సుప్రీం స్టే: కీలక ట్విస్ట్
మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు తుది విచారణను చేపట్టింది. పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే, మనోహర్ లాల్ శర్మ తన వాదనలను వినిపించారు. పిటీషన్దారుల్లో మనోహర్ లాల్ శర్మ కూడా ఒకరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదనలను వినిపించారు.
ఈ సందర్భంగా ఆయన నిషేధిత వేర్పాటు సంస్థ ఖలిస్తాన్ పేరును ప్రస్తావించారు. రైతులు చేపట్టిన నిరసన దీక్షల్లో ఖలిస్తాన్ నాయకులు పాల్గొంటున్నారని వివరించారు. రైతుల నిరసన ఉద్యమంలో ఖలిస్తాన్ నాయకులు చొరబడ్డారని, వారిని రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బొబ్డే స్పందించారు. ఎవరో చేసిన ఆరోపణలను తమ వద్ద వినిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనిపై పక్కా ఆధారాలు ఉంటే అఫిడవిట్ రూపంలో బుధవారం నాటికి సమర్పించాలని ఆదేశించారు. దీనికి ఆయన అంగీకరించారు. తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని, వాటిని గడువులోగా అందిస్తామని స్పష్టం చేశారు.
ఇదివరకు సుప్రీంకోర్టు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలోనూ అఫిడవిట్ను అడిగిన విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ తనకు రాసిన లేఖను అఫిడవిట్ రూపంలో తిరిగి సమర్పించాలంటూ ఇదివరకు చీఫ్ జస్టిస్ ఆదేశించిన విషయం తెలిసిందే. అఫిడవిట్ను సమర్పించడం ద్వారా ఆ సాక్ష్యాధారాలకు చట్టబద్ధతను కల్పించినట్టవుతుందనేది న్యాయ నిపుణుల వాదన. ఆ చట్టబద్ధత కోసమే ఇదివరకు వైఎస్ జగన్.. తాజాగా మోడీ సర్కార్కు అఫిడవిట్ను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.