లవ్ జిహాద్కు ‘ఖాన్ త్రయం’ ప్రోత్సాహం, వారి సినిమాలు చూడొద్దు: సాధ్వి
ముంబై: భారతీయ జనతా పార్టీ నాయకురాలు సాధ్వి ప్రాచీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులందరూ బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ల సినిమాలను బహిష్కరించాలని కోరారు. ఎందుకంటే వారు లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తున్నందున వారిని సినిమాలను చూడొద్దని పేర్కొన్నారు.
డెహ్రాడూన్లో జరిగిన విశ్వహిందూ పరిషత్ సమావేశాలో ఆమె మాట్లాడుతూ.. ‘ఖాన్ల సినిమాలను చూసి మన పిల్లలు తప్పుదోవ పడుతున్నారు. వారు లవ్ జిహాద్ను ప్రమోట్ చేస్తున్నారు. ఖాన్ల సినిమాల పోస్టర్లను మీ ఇంటిగోడలపై వేయించుకోవద్దు' అని తెలిపారు.
అంతేగాక, లవ్ జిహాద్ అనేది బలవంతపు మార్పిడి అని, హిందూ సంస్థలు వీటిని వ్యతిరేకించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓ సూచన కూడా చేశారు. అదేంటంటే.. ప్రస్తుతం బ్రహ్మచారిగా ఉన్న ఆయన.. భారతీయ యువతినే వివాహం చేసుకోవాలని అన్నారు.
ఇటీవల కూడా సాధ్వి ప్రాచీ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హిందూ మహిళలు కనీసం నలుగురు పిల్లలను కనాలని కోరింది. ‘ఒక్కరు లేదా ఇద్దరు సంతానం ముద్దు' అనే నినాదం వద్దు అని ఆమె చెప్పారు.