వివస్త్రులను చేసి... అందరిముందు నగ్న స్నానం... అక్రమ సంబంధానికి ఖాప్ పెద్దల శిక్ష
రాజస్తాన్లో దారుణం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలతో ఓ యువ జంటకు ఖాప్ పంచాయితీ దారుణ శిక్ష విధించింది. గ్రామస్తులందరి ముందు ఆ ఇద్దరిని బలవంతంగా వివస్త్రులను చేసి నగ్న స్నానం చేయించింది. అలాగే రూ.53వేలు జరిమానా కూడా విధించింది. అందరిముందు ఆ యువజంటను స్నానం చేయించడం ద్వారా వారిద్దరినీ శుద్ది చేయించినట్లయిందని,వారు చేసిన పాపానికి ఇదే ప్రాయశ్చిత్తమని ఖాప్ పంచాయతీ పెద్దలు చెబుతున్నారు. అగస్టు 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగింది...
రాజస్తాన్లోని సికార్ జిల్లాలో ఉన్న సోలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మేనల్లుడు,అత్త వరుసయ్యే ఓ యువతీ,యువకుడికి సంబంధించి కొద్ది వారాల క్రితం ఓ వీడియో వెలుగుచూసింది. ఆ ఇద్దరూ ఏకాంతంగా కలిసి ఉన్న సమయంలో ఎవరో సీక్రెట్గా వీడియో చిత్రీకరించి దాన్ని లీక్ చేయడంతో అది వైరల్గా మారింది. ఈ విషయం గ్రామంలో పాంచ్ పటేల్స్గా పిలవబడే సాన్సి తెగకు చెందిన పెద్ద మనుషుల దృష్టికి వెళ్లడంతో ఖాప్ పంచాయితీ ఏర్పాటు చేసి అగస్టు 21న ఆ ఇద్దరిని పిలిపించారు.
అందరి ముందే నగ్న స్నానం...
వందలాది మంది గ్రామస్తులు చూస్తుండగానే బలవంతంగా ఆ ఇద్దరిని వివస్త్రులను చేశారు. అనంతరం అందరి ముందే వారు స్నానం చేయాలని ఆదేశించారు. పెద్ద మనుషుల నిర్ణయాన్ని ఎదిరించే సాహసం చేయలేక ఆ ఇద్దరు వారు చెప్పినట్లు చేశారు. ఆపై ఆ యువకుడి కుటుంబానికి రూ.31వేలు,ఆ యువతి కుటుంబానికి రూ.22వేలు జరిమానా విధించారు. ఆ డబ్బును చెల్లించిన తర్వాతే తిరిగి ఆ కుటుంబాలను తమ కులంలోకి అంగీకరించారు. ఆ జరిమానా డబ్బును ఖాప్ పంచాయితీ పెద్ద మనుషులే పంచుకున్నారు.
పోలీసులు ఏమంటున్నారు...
ఈ దారుణంపై సాన్సి డెవలప్మెంట్ కౌన్సిల్ మంగళవారం(సెప్టెంబర్ 1) సికర్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై అడిషనల్ ఎస్పీ దేవేంద్ర శర్మ మాట్లాడుతూ... ' ఆ ఇద్దరి కుటుంబాల అంగీకారంతోనే వారిద్దరినీ అందరిముందు స్నానం చేయించారు. బాధితురాలితో పాటు ఆమె అత్తింటివారితో మాట్లాడాం. దీనిపై విచారణకు లక్ష్మణ్ఘర్కి చెందిన ఎస్సీ ఎస్టీ సెల్ సీవోని పంపించాం.' అని తెలిపారు.
Recommended Video
ఖాప్ పంచాయితీల ఆగడాలు...
అఖిల రాజస్తాన్ సాన్సీ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి రాకేష్ కుమార్ ప్రకారం.... సాన్సి తెగలో ఇలాంటి సాంఘీక దురాచారాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. వారిద్దరిని అందరి ముందు స్నానం చేయించేందుకు ఒకవేళ ఆ రెండు కుటుంబాలు ఒప్పుకోకపోతే వారిపై సామాజిక బహిష్కరణ విధిస్తారు. అప్పటినుంచి ఇక ఆ కులంలో జరిగే ఈ ఏ కార్యక్రమాలకు వారికి ఆహ్వానం ఉండదు. ఒకవేళ ఎవరైనా సాహసించి పిలిస్తే... వారికీ బహిష్కరణ తప్పదు. పాంచ్ పటేల్ పేరుతో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ నిరక్షరాస్యులను,పేదలను దోపిడీ చేసే ఈ చర్యలకు ఫుల్ స్టాప్ పడాలని రాకేష్ అన్నారు.