ఆ అల్లర్ల వెనుక ఆరెస్సెస్ హస్తం.. ‘మౌనిబాబా’ మాట్లాడరేం?: లోక్సభలో ధ్వజమెత్తిన మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అల్లర్ల వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని, సమాజంలోని కులాల మధ్య ఆరెస్సెస్ చిచ్చుపెడుతోందని, మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న హింసకు అరెస్సెస్దే బాధ్యత అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
Recommended Video
శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్సభ జీరో అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తిన ఖర్గే... కొన్ని నియంతృత్వ శక్తులు దళితులను అణిచివేయాలని చూడడం వల్లే మహారాష్ట్రలో హింసాత్మక పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు.
మౌనిబాబా.. మాట్లాడరేం?
మహారాష్ట్రలో హింస ప్రజ్వరిల్లినా ప్రధాని మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మోడీని ‘మౌని బాబా'గా అభివర్ణించిన ఖర్గే... మహారాష్ట్ర హింసపై ఇకనైనా ప్రధాని నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
అల్లర్ల వెనుక ఆరెస్సెస్...
అల్లర్ల వెనుక ఆరెస్సెస్ సహా హిందుత్వ శక్తులున్నాయని, మహారాష్ట్రలో దళితులు, మరాఠాల మధ్య చిచ్చు పెట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం చెబుతుండటంతో ఆగ్రహించిన ఖర్గే తన చేతిలోని పత్రాలను చించివేశారు.
దళితులపై హింసాకాండ...
దళితులకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీ నిత్యం మౌనం వహిస్తున్నారని లోక్సభలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో దళితులపై హింసాకాండ సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
బీజేపీ అధికారంలో ఉన్న ప్రతీచోటా...
భీమా-కోరెగావ్ యుద్ధం ద్విశత వార్షికోత్సవ వేడుకల్లో తలదూర్చేందుకు ప్రయత్నించిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గుజరాత్లో కావచ్చు... ఉనా, రాజస్థాన్.. ఇలా బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి చోటా అన్యాయమే రాజ్యమేలుతోంది. దీనిపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలి..'' అని ఖర్గే డిమాండ్ చేశారు.