రైతులపై టియర్ గ్యాస్ -సీఎంకు చుక్కలు చూపించారు -మహాపంచాయిత్ వేదిక ధ్వంసం
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసలు చేస్తోన్న రైతుల్లో చీలిక తెచ్చేందుకు బీజేపీ సర్కారు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ 'కిసాన్ మహా పంచాయత్' పేరుతో ఆదివారం తలపెట్టిన సభకు నిరసన సెగ తగిలింది. రైతుల ఆందోళనతో వెనక్కి తగ్గిన ఆయన తన సభను రద్దు చేసుకున్నారు.
నిమ్మగడ్డకు టీడీపీ నేతల సన్మానం -ఎస్ఈసీ ఆలయాల సందర్శనలో సంచలనం -చంద్రబాబు విశ్వాసం కోసం..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఒనగూరే ప్రయోజనాలను రైతులకు వివరించేందుకుగానూ కెమ్లా గ్రామంలో సీఎం సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉండగా.. రైతులు పెద్ద సంఖ్యలో గుమ్మికూడి నిరసనలు తెలిపారు. సీఎం రాక సందర్భంగా భారీగా మోహరించిన పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగి.. చివరిది బలప్రయోగానికి దారితీసింది..
రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని రైతులు గ్రామంలోని వేదిక వద్దకు చేరుకుని ఆందోళన కొనసాగించారు. వేదికపైకెక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ కోసం ఏర్పాటు చేసిన కుర్చీలను విసిరిపారేశారు. సభా వేదిక వద్ద ఆందోళన జరుగుతుండడంతో ముఖ్యమంత్రి ఖట్టర్ 'కిసాన్ మహా పంచాయత్'ను రద్దు చేసుకున్నారు.
హర్యానా సీఎం ఖట్టర్ రాజకీయ ప్రేరితంగా నిర్వహించతలపెట్టిన 'కిసాన్ మహా పంచాయత్'పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. తిండిపెడుతున్న రైతుల సెంటిమెంట్లతో ఆటలు ఆడుకోవద్దని, లా అండ్ ఆర్డర్లో జోక్యం చేసుకోవద్దని, రైతులతో మీరేమైనా మాట్లాడాలనుకుంటే.. 46 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడాలని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా అన్నారు.