ఈసి: మోడీకి ఖూనీ పంజా షాక్, రాహుల్కు జాగ్రత్తలు
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. కాంగ్రెస్ ఎన్నికల చిహ్నమైన హస్తం గుర్తును ఖూనీ పంజా(రక్తసిక్తమైన హస్తం)గా అభివర్ణించడం ద్వారా మోడీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని భావించిన ఈసి బుధవారం ఈ నోటీసు జారీ చేసింది.
చత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినందుకు మీపై ఎందుకు చర్య తీసుకోరాదో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా తెలియజేయాలని కూడా ఈసి ఆ నోటీసులో మోడీని ఆదేశించింది. పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేయడం ద్వారా మీరు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి చేందిన నిబంధనలను ఉల్లంఘించారని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నామని అందువల్ల ఎందుకు చర్యలు తీసుకోరాదో నవంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తెలియజేయాలని ఈసి నోటీసులో పేర్కొంది.
ఒకవేళ అడువులోగా సమాధానం అందని పక్షంలో ఎన్నికల కోడ్ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈసి ఆ నోటీసులో పేర్కొంది. నోటీసు జారీ చేయడానికి ముందు ఈసి ఈ నెల 7న చత్తీస్గఢ్లోని డోంగర్గఢ్ రాజ్నంద్గావ్లో చేసిన మోడీ ప్రసంగం సిడిని, దానితో పాటే రిటర్నింగ్ అధికారి వ్యాఖ్యలను తెప్పించుకుంది.
రాహుల్ పైన అసంతృప్తి
మరోవైపు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ఈసి బుధవారం మందలించింది. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు, ఆయన ప్రసంగాల తీరుపై ఎన్నికల కమిషన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మన్ముందు జాగ్రత్తగా మసలుకోవాలని, మరోసారి ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రాహుల్కు ఇసి హితవు చెప్పింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతూ రాహుల్ ఎనిమిది పేజీలతో కూడిన వివరణ ఇచ్చిన నాలుగు రోజుల తర్వాత ఈసి ప్రతిస్పందించింది.
రాహుల్ వివరణ ఆమోదయోగ్యంగా లేదని, ఈ వివరణలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మతసామరస్యతను పెంపొందించాలన్న ఉద్దేశంతోనే రాహుల్ ఈ ప్రసంగాలు చేసినట్టు ఎన్నికల కమిషన్ గుర్తిస్తున్నప్పటికీ ఆయన ప్రసంగించిన తీరు మాత్రం అభ్యంతరకరంగా ఉందని, రాహుల్ ప్రసంగాల్లోని కొన్ని భాగాలు ఎన్నికల నియమావళి స్ఫూర్తికి అనుగుణంగా లేవని పేర్కొంది. అక్టోబర్ 31న రాహుల్కు ఈసి నోటీసులు పంపి వివరణ కోరింది. ముజఫర్నగర్ ఘర్షణలు, ఐఎస్ఐను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఈసికి ఫిర్యాదు చేసింది.