నపుంసకుడు: మోడీపై ఖుర్షీద్, 'డాక్టర్ని కాదని' వివరణ
లక్నో: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఓ ర్యాలీలో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. మోడీని నపుంసకుడిగా అభివర్ణించారు. దీనిపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఓడిపోతామనే ఒత్తిడిలో మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు.
ఉత్తరప్రదేశ్లోని తన లోకసభ నియోజకవర్గం ఫరూఖాబాదులో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సల్మాన్ ఖుర్షీద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 2002 గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా అల్లర్లకు సంబంధించి ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
ఓ బలమైన.. శక్తివంతమైన వ్యక్తినని ఆయన చెప్పుకుంటున్నారని, ఆయన ప్రధాని కావాలని కాంక్షిస్తున్నారని, ఆయన నిజంగానే బలమైన వ్యక్తి అయితే గోద్రా ఘటన నుండి ప్రజలను ఎందుకు రక్షించలేక పోయారని ఖుర్షీద్ ప్రశ్నించారు. కొందరు వ్యక్తులు ఇలా వచ్చి, అలా దాడి చేసి వెళ్లిపోయారని, అప్పుడు ఎందుకు రక్షించలేకపోయావని మోడీని ఉద్దేశించి అడిగారు.
నీవు శక్తివంతమైన వ్యక్తివి కాదన్నారు. తమ ఆరోపణలు ప్రజలను రక్షించలేకపోయినందుకు కాదని, నీవో నపుంసకుడివి అని వ్యాఖ్యానించారు. అయితే, ఖుర్షీద్ ఎక్కడా మోడీ పేరును ప్రస్తావించకుండా, పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బిజెపి ఖండించింది. కాంగ్రెస్ సంస్కారం, సభ్యతను విడిచి ఈ విధంగా ప్రవర్తిస్తోందని ఆ పార్టీ నేత షాన్వాజ్ హుస్సేన్ మండిపడ్డారు. విదేశాల్లో చదువుకున్న ఖుర్షదీ భారతీయ విలువలను మర్చిపోకూడదని సూచించారు.
ఖుర్షీద్ వివరణ
నపుంసకుడు(ఇంపోనెంట్) అన్న తన వ్యాఖ్యలపై ఖుర్షీద్ ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ఢిల్లీలో ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. తాను మోడీ లైంగిక పటుత్వాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. గోధ్రా అల్లర్ల విషయంలో ఆయన చేతకానితనాన్ని ఎత్తిచూపుతూ నపుంసకుడు అన్నానని వివరణ ఇచ్చారు. ఆ పదాన్ని తాను టీవి చానళ్ళ నుంచే నేర్చుకున్నానని, ఏమీ చేయలేనివాణ్ణి ఆ పదంతో సంబోధించడం తాను విన్నానని తెలిపారు.
బిజెపి తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుందన్నారు. 'ఇంపోనెంట్'కు అర్థం కావాలంటే తాను డిక్షనరీ పంపిస్తానని చెప్పారు. తాను రాజకీయాల్లో ఇంపోనెంట్ గురించి మాట్లాడానని చెప్పారు. తాను వైద్యుడిని కాదని, తాను అతనిని టెస్టు చేయలేదని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు.
నితీష్కు పిచ్చెక్కిందని లాలూ
తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎరవేశారని ఆర్జేడి చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పైన మండిపడ్డారు. బిజెపి నుండి వేరుపడ్డాక నితీష్కు పిచ్చెక్కిందని, వైరి పక్షాల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎరచూపుతున్నారని ఆరోపించారు. మైనార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందామని చూస్తున్నారన్నారు.