రెచ్చిన శివసేన: కులకర్ణి ముఖానికి సిరా పూశారు
ముంబై: మహారాష్ట్ర శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్జీద్ కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పూర్తి భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చిన హామీ వట్టిదే అయింది. ఈ పుస్తకావిష్కరణ సోమవారం సాయంత్రం జరుగుతుంది.
ఈలోగానే సోమవారం ఉదయం శివసేన కార్యకర్తలు మాజీ దౌత్యవేత్త, రచయిత సుదీంధ్ర కులకర్ణ ముఖానికి సిరా పూసి అవమానించారు. శివసేన కార్యకర్తలు తన ముఖానికి నల్లరంగు పూశారని కులకర్ణి ఆరోపించారు. ఈ సంఘటన కులకర్ణి నివాసం వెలుపల జరిగింది.
నైదర్ ఏ హాక్, నార్ ఎ డోన్ - యాన్ ఇన్సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్తాన్ ఫారిన్ పాలసీ అనే పుస్తకావిష్కరణ సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు వొర్లిలోని నెహ్రూ సెంటర్లో జరగనుంది. కులకర్ణి ఈ కార్యక్రమాన్ని మోడరేట్ చేయనున్నారు.
కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమ నిర్వహణను రద్దు చేయాలని అంతకు ముందు శివసేన నెహ్రూ ప్లానిటోరియానికి చెందినవారిని హెచ్చరించింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, అందువల్ల కార్యక్రమాన్ని రద్దు చేసుకోకపోతే విచ్ఛిన్నం చేస్తామని శివసేన హెచ్చరించింది.