జయలలితతో ఖుష్బూ ఢీ: నటి వైపే కాంగ్రెస్-డిఎంకె చూపు
చెన్నై: తమిళనాడులో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పైన సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖుష్బూను పోటీకి దింపాలని కాంగ్రెస్-డిఎంకె కూటమి భావిస్తోంది.
జయలలిత చెన్నై పరిధిలోని ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఖుష్బూను ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థినిగా బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
జయలలిత పోటీలో ఉన్న నేపథ్యంలో ఆర్కే నగర్ నుంచి ఇమేజ్ కలిగిన ఖుష్బూ నుంచి రంగంలోకి దింపితే బాగుంటుందని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. కాగా, జయలలితకు పోటీగా ఓ హిజ్రా ఇప్పటిరే రంగంలోకి దిగారు.
ఖుష్బూ తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కీలక నేతగా మారారు. ఆమె తొలుత డీఎంకే పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, తమిళనాడు ఎన్నికల సందర్భంగా డిఎంకె, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు ఖుష్బూ వైపు చూస్తున్నాయి.