క్షమాపణలు చెప్పినా సరే ... బీజేపీ నేత ఖుష్బూపై 50 పోలీస్ స్టేషన్లలో దివ్యాంగుల సంఘం ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవల బీజేపీలో చేరిన ఖుష్బూ సుందర్ కాంగ్రెస్ పార్టీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . కాంగ్రెస్ పార్టీ మనో వైకల్యం ఉన్నవారి పార్టీ అని , మేధో వైకల్యం ఉందని ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రచ్చ మొదలైంది . వికలాంగుల హక్కులపై నేషనల్ ప్లాట్ఫామ్ (ఎన్పిఆర్డి) తమిళనాడులోని వివిధ జిల్లాల్లో వికలాంగులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ నేత ఖుష్బూ సుందర్పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
కాంగ్రెస్ కు షాక్ ... బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఖుష్బూ.. రానున్న ఎన్నికలే టార్గెట్
కాంగ్రెస్ మానసిక వికలాంగుల పార్టీ అన్న వ్యాఖ్యలపై దుమారం
తమిళనాడు అసోసియేషన్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ కేర్ గివర్స్ అనే దివ్యాంగుల హక్కుల సంఘం ఖుష్బూ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత సోమవారం బిజెపిలో చేరిన ఖుష్బు, తాను "మానసిక వికలాంగుల" పార్టీ నుండి బయటకు వచ్చానని చెప్పారు. వైకల్యం ఉన్న వారిని అవమానపరిచేలా ఖుష్బూ సుందర్ వ్యాఖ్యలు చేశారని ఆమెపై 50 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినట్టు సమాచారం .
50 పోలీస్ స్టేషన్లలో ఖుష్బూ పై ఫిర్యాదులు
ఎన్పిఆర్డి ప్రధాన కార్యదర్శి మురళీధరన్ మాట్లాడుతూ రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ పై దాదాపు 50 పోలీస్స్టేషన్లలో అభ్యంతరకర వ్యాఖ్యపై ఫిర్యాదులు నమోదయ్యాయని పేర్కొన్నారు . చెన్నై, కాంజీపురం, చెంగల్పేట, మదురై, కోయంబత్తూర్, తిరుపూర్ వంటి ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పారు. దివ్యాంగులను అవమానించేలా ఖుష్బూ వ్యాఖ్యలు దారుణం అని మండిపడ్డారు .
ఖుష్బూ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామని చెప్తున్న దివ్యాంగుల సంఘం
ఖుష్బూ తన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా రాజకీయంగా మాట్లాడే అన్ని హక్కులను కలిగి ఉన్నారని , కానీ వైకల్యాన్ని ఒక నెగిటివ్ షేడ్ లో చిత్రీకరించే పదాల వాడకం ఆమోదయోగ్యం కాదని ఎన్పిఆర్డి అధికారి తెలిపారు. రాజకీయ ప్రత్యర్థుల ఇమేజ్ను దెబ్బతీసేందుకు ఏ మాట పడితే ఆ మాట వాడి తమ వంటి వాళ్ళను అవమానపరిస్తే సహించలేమని ,ఖుష్బూ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఆమె వ్యాఖ్యలు చట్ట విరుద్ధం అని దీనికి ఆమెకు ఆరు నెలల కాలం శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు .
ఖుష్బూ క్షమాపణలు చెప్పినా సరే ... వదలని దివ్యాంగులు
ఖుష్బూ తన వ్యాఖలపై పత్రికా ముఖంగా క్షమాపణలు కోరినా , తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని చెప్పినా సరే ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేది లేదని చెప్తున్నారు . రాజీ లేని పోరాటం చేస్తామని వారంటున్నారు . దీంతో తాజాగా కాంగ్రెస్ నుండి బీజేపీకి పార్టీ మారిన ఖుష్బూ ముందు ముందు ఎలాంటి సమస్యలు ఫేస్ చెయ్యాల్సి వస్తుందో తెలియాల్సి ఉంది .