నెటిజన్ల ప్రశ్నలు: బీజేపీ-రాహుల్ ప్రధాని-పవన్ కళ్యాణ్లపై నటి ఖుష్బూ సమాధానం
చెన్నై: ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఖుష్బూ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆమె ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆమెకు ఇష్టమైన వంటకాల నుంచి రాజకీయాల వరకు పలు ప్రశ్నలు అడిగారు. ఎన్నో ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పాలనపై స్పందించారు. అలాగే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగతంగా కొందరి గురించి మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి...
కాంగ్రెస్ పార్టీ గురించి
కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని సమైక్యంగా, సెక్యులర్గా ఉంచి, ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీ అని అందుకే తాను ఆ పార్టీలో చేరానని చెప్పారు. కర్ణాటకలో రజనీకాంత్ నటించిన కాలా సినిమాను అడ్డుకోవడంపై స్పందిస్తూ.. కాంగ్రెస్లో ఉన్నంత మాత్రాన తనను ఏం చేయమంటారని అడిగారు. 2019లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా అంటే మీరు చూస్తారని, ఆయన బెస్ట్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆయన కేబినెట్లో ఉంటారా అంటా.. ఆ రోజు వచ్చాక చూద్దామన్నారు.
కమల్ హాసన్ రాజకీయ ఆరంగేట్రంపై
నటుడు కమల్ హాసన్ రాజకీయ ఆరంగేట్రంపై ఖుష్బూ మాట్లాడుతూ.. మార్పు కోసం చక్కటి ఆలోచనలతో వస్తున్న అధ్భుతమైన వ్యక్తి అన్నారు. రాజకీయాల్లో తనకు గురువు కరుణానిధి అని చెప్పారు. ఇందిరాగాంధీ కూడా ఇష్టమన్నారు. తనకు కాంగ్రెస్ భావజాలం అంటే ఇష్టమన్నారు.
పవన్ కళ్యాణ్ గురించి
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంజి సహ నటుడు అని ఖుష్బూ చెప్పారు. ఆయనతో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. మహేష్తో తాను నటించలేదు కాబట్టి ఆయన గురించి పెద్దగా తెలియదన్నారు. వెంకటేష్ నా సెంటిమెంట్ హీరో అన్నారు. తారక్ తనకు ఇష్టమైన వ్యక్తి అన్నారు. చిరంజీవి లెజెండ్ అని, మంచి మనసున్న వ్యక్తి అన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తుందని కలలు
ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన అనుచరుల గురించి చెప్పేందుకు ఇది సరైన సమయం కాదని ఓ సందర్భంలో చెప్పారు. యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. మరో సందర్భంలో 2019లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు కలలు కంటున్నారని చెప్పారు. రజనీకాంత్ గురించి మాట్లాడుతూ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ అన్నారు.